Bhishma Food Rules: భీష్ముడు చెప్పినట్టుగా ఆహారం తీసుకుంటే... వందేళ్లు ఈజీగా బతికేయ్యొచ్చు
ఆహారం తీసుకునే సమయంలో భీష్ముడు చెప్పిన విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు...నిండు నూరేళ్లు ఎలాంటి రుగ్మతలు లేకుండా హాయిగా జీవించవచ్చు.
Bhishma Food Rules: ఆహారం కేవలం ఆకలిని తీర్చే ఇంధనం మాత్రమే కాదు.. అది మన మనస్సును, ఆత్మను శాసించే శక్తివంతమైన ఔషధం! మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన ధర్మాలలో ఆహార నియమాలు అత్యంత కీలకమైనవి. మహాభారత విశ్లేషణ ప్రకారం, భీష్ముడు చెప్పిన విధానంలో ఆహారాన్ని స్వీకరిస్తే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరాల ఆయుష్షును సునాయాసంగా పొందవచ్చు. ఆహారాన్ని అమృతంగా మార్చే ఈ ప్రాచీన నియమాలు, నియంత్రణ లేని ఆధునిక ఆహారపు అలవాట్లకు ఒక అద్భుతమైన పరిష్కార మార్గాన్ని చూపుతున్నాయి.
వండేవారి భావోద్వేగాలు ... సాత్వికాహార ప్రాధాన్యత
ఆహారాన్ని వండే వ్యక్తుల మనోభావాలు ఆ ఆహారంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కోపం, ద్వేషం, అసూయతో వండిన భోజనం విషంతో సమానమవుతుంది. శ్రద్ధ, ప్రేమ, పరిశుద్ధమైన మనస్సుతో తయారుచేసిన వంట మాత్రమే శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. ప్రకృతిసిద్ధంగా లభించే పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం, మధ్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమాత్మకు కృతజ్ఞతగా అర్పించి, 'బ్రహ్మార్పణం' అని జపించి స్వీకరించడం వల్ల ఆ ఆహారం పవిత్రమైన ప్రసాదంగా మారుతుంది.
ఏకాగ్రత, క్రమశిక్షణ ... జీర్ణవ్యవస్థకు విశ్రాంతి
ఆహారం తినే సమయంలో టీవీలు, మొబైల్ ఫోన్లు చూడటం, అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల ఆహారం యొక్క శక్తి క్షీణిస్తుంది. పంచేంద్రియాలను ఏకాగ్రత చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆహారాన్ని దైవ ప్రసాదంగా భావిస్తూ నిశ్శబ్దంగా భుజించాలి. వారానికి లేదా పక్షానికి ఒకరోజు ఉపవాసం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. అపవిత్రమైన ప్రదేశాలలో ఆహారాన్ని స్వీకరించకూడదని, పరిమితంగా భుజించడమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని భీష్ముడు స్పష్టం చేశారు. ఈ పవిత్రమైన సూత్రాలను నిత్య జీవితంలో ఆచరిస్తే శరీరం, మనస్సు, ఆత్మ శుద్ధి అయి పరిపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇకనుంచైనా మనం ఇలా పవిత్రంగా ఆహారం స్వీకరించేలా మన శరీరాన్ని అలవాటు చేద్దాం. నూరేళ్లపాటు జీవిద్దాం.




