Color Changing Shiva Lingam: రంగులు మార్చుకునే శివలింగం...రోజులో ఐదుసార్లు ఇలా దర్శనం

నల్లూరులో కొలువైన కళ్యాణ సుందరేశ్వర స్వామివారి ఆలయంలోని శివలింగం రోజుకు ఐదుసార్లు రంగులు మారుతుంది.

Balachander
Published on: 23 May 2026 8:32 AM IST
Color Changing Shiva Lingam: రంగులు మార్చుకునే శివలింగం...రోజులో ఐదుసార్లు ఇలా దర్శనం
X

Color Changing Shiva Lingam: ఈ సృష్టిలో భగవంతుడి లీలలు అనంతం. ఇలాంటి లీలల అద్భుతాలు సైన్స్‌కి కూడా అందకుండా ఉంటాయి. అలాంటి ఒక పరమాద్భుత క్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం నల్లూరులో కొలువై ఉన్న "కళ్యాణ సుందరేశ్వర స్వామి" ఆలయం. ఈ ఆలయంలోని ప్రధాన శివలింగం రోజుకు ఐదుసార్లు ఐదు వేర్వేరు రంగుల్లోకి మారడం ఇక్కడి ప్రాధాన్యత. కేవలం భక్తిభావంతోనే కాకుండా, కంటితో చూసి తరించాల్సిన ఈ మహిమాన్విత శివలింగ విశేషాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రంగులు మారుతున్న శివలింగం

ఈ ఆలయంలోని స్వయంభూ శివలింగం సూర్యుని గమనాన్ని బట్టి, రోజులోని వివిధ పూజా సమయాల్లో రంగులు మారుతూ భక్తులను అబ్బురపరుస్తుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉదయకాల పూజ సమయంలో శివలింగం నలుపు రంగులో దర్శనమిస్తుంది. ఈ సమయంలో స్వామిని భక్తులు 'వైద్యనాథుడిగా' కొలుస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు మధ్యాహ్న అభిషేక సమయానికి శివలింగం ఒక్కసారిగా పవిత్రమైన తెలుపు రంగులోకి మారిపోతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదోష సమయంలో స్వామివారి రూపం కాంతులీనే ఎరుపు రంగులోకి మారుతుంది. ఇక రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రాత్రి పూజల సమయంలో ఈ శివలింగం ప్రశాంతతను పంచే లేత నీలం రంగును సంతరించుకుంటుంది. అర్థరాత్రి సమయంలో ఈ శివలింగం ఎంతో ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో మెరిసిపోతుంది.

సైన్స్‌కు అందని రహస్యం.. వెయ్యేళ్ల చరిత్ర

ఉత్తరాదిన కాశీ విశ్వనాథునికి ఎంతటి పవిత్రత ఉందో, దక్షిణాదిన ఈ కళ్యాణ సుందరేశ్వరునికి అంతటి ప్రాశస్త్యం ఉంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం, మొదటి చోళ రాజు ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు. చరిత్రలో ఎందరో దురాక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ పురాతన క్షేత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఇక్కడి అమ్మవారు ‘గిరి సుందరి’గా భక్తుల పూజలందుకుంటున్నారు.

శాస్త్రవేత్తలు సైతం ఈ శివలింగం రంగులు మారడం వెనుక ఉన్న భౌతిక, రసాయన కారణాలను కనుగొనడానికి ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఇది ఏ రకమైన శివలింగం అనే విషయాన్ని గానీ, రంగులు మారే రహస్యాన్ని గానీ ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అందుకే సామాన్య భక్తుల నుండి పండితుల వరకు అందరూ దీనిని ఆ పరమశివుని సాక్షాత్కార లీలగానే నమ్ముతారు. మనస్ఫూర్తిగా కాసిన్ని నీళ్లు పోసి నమస్కరిస్తే చాలు, కోరిన కోర్కెలు తీర్చే ఈ భోళాశంకరుని రంగుల రూపాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరాల్సిందే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story