Devshayani Ekadashi: బ్రహ్మ చెప్పిన ఏకాదశి విశిష్టత... కరువు నుంచి రక్షించిన ఏకాదశి
బ్రహ్మదేవుడు నాదర మహర్షికి దేవశయనీ ఏకాదశి గురించి, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో వివరించి చెప్పారు. వర్షాలు ఎలా కురిపించారో కూడా తెలియజేశారు.
Devshayani Ekadashi: కఠినమైన కరువు కాటకాల నుంచి రాజ్యాన్ని, ప్రజలను గట్టెక్కించి సమృద్ధిగా వర్షాలను కురిపించిన పవిత్రమైన పర్వదినమే తొలి ఏకాదశి. భవిష్యోత్తర పురాణం ప్రకారం స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించిన ఈ ఏకాదశి వ్రత మహత్యం సకల పాపాలను పరిహరించి, శుభాలను ప్రసాదిస్తుంది.
దేవశయనీ ఏకాదశి ప్రాశస్త్యం
ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి తొలి ఏకాదశి, పద్మ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ పవిత్ర రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రకు ఉపక్రమిస్తారు. సరిగ్గా నాలుగు నెలల పాటు స్వామివారు యోగనిద్రలో ఉండి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. అందుకే ఈ నాలుగు నెలల కాలాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావించి 'చాతుర్మాస్య దీక్ష'ను ఆచరిస్తారు.
కరువును తారడించిన పౌరాణిక కథ
పూర్వం మాంధాత అనే ధార్మిక రాజు పాలనలో దేశంలో వరసగా పలు సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు ఏర్పడింది. వానలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడిపోయారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజు, ఆంగీరస మహర్షిని ఆశ్రయించగా.. ఆయన ఆషాఢ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించారు. మహర్షి సూచన మేరకు మాంధాత రాజు, ప్రజలతో కలిసి పూర్తి నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించారు. శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై ఆకాశం నుంచి సమృద్ధిగా వర్షాలు కురిసేలా అనుగ్రహించారు. దాంతో రాజ్యం మళ్లీ సస్యశ్యామలమైంది.
భక్తులు పాటించవలసిన నియమాలు
తొలి ఏకాదశి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును, సత్యనారాయణ స్వామిని భక్తితో ఆరాధించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత, ఐశ్వర్యం లభిస్తాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు మర్నాడు ద్వాదశి ఘడియల్లో, అంటే సూర్యోదయం నుంచి ఉదయం 08:29 గంటల లోపు పారణ చేసి వ్రతాన్ని పూర్తి చేయాలి. పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి, విష్ణుమూర్తి దివ్యానుగ్రహం కలుగుతుంది.




