Hazariya Mahadev Temple: ఏడాదిలో మూడు రోజులే దర్శనం...ప్రతి హైందవుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే
ఏడాదిలో మూడు రోజులు మాత్రమే తెరుచుకునే ఆలయం మధ్యప్రదేశ్లోని హజారియా మహాదేవ్ ఆలయం. ఒక్కసారైనా సరే జీవితంలో దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
Hazariya Mahadev Temple: భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. పురాతన చరిత్ర కలిగిన రహస్యమైన, మార్మికమైన ఆలయాలను మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు, నిత్యం మనం శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకం, అర్చనలు కూడా చేస్తూనే ఉన్నాం. కానీ, ఏడాది పొడవునా మూసి ఉండి కేవలం మూడు రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం గురించి మీరెప్పుడైనా విన్నారా... జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించాలని మన పెద్దలు చెబుతుంటారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఎవరికైనా తెలుసా? ఇలాంటి మార్మికమైన ఆలయం మధ్యప్రదేశ్లోని బుందేల్ ఖండ్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని హజారియా మహాదేవ ఆలయం అని పిలుస్తారు. దీని చరిత్ర, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
10వ శతాబ్దపు శిల్పకళా వైభవం
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతం చందేల్ రాజుల కాలం నాటి హస్తకళలకు, కట్టడాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పాలి అనే ప్రాంతంలో ఉన్న హజారియా శివాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయ గర్భగుడిలోకి అడుగుపెట్టడమే ఒక అతీంద్రియ అనుభూతిని ఇస్తుంది. ఇక్కడి ప్రధాన శివలింగంపై చిన్న చిన్న శివలింగాలు చెక్కబడి ఉంటాయి. మొత్తం 1008 శివలింగాలు ఒకే లింగంపై కొలువై ఉండటం వల్లనే ఈ స్వామికి 'హజారియా మహాదేవుడు' అనే పేరు వచ్చింది.
ఆ మూడు రోజులు మాత్రమే ఎందుకు?
ఈ ఆలయం ఏడాది పొడవునా మూసి ఉంటుంది. కానీ హైందవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఈ మూడు రోజుల్లో మాత్రమే ఆలయ తలపులు తెరుస్తారు. ఒకటి మహాశివరాత్రి రోజున, రెండోది శ్రావణ సోమవారం రోజున, మూడోది కార్తీక పౌర్ణమి రోజున. ఈ మూడు రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజిస్తే ఏకకాలంలో 1000 శివలింగాలను అభిషేకించినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
భక్తులు ఎందుకు దర్శించాలి?
జీవితంలో ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా దక్కని ప్రశాంతత, పుణ్యం ఈ హజారియా మహాదేవుని ఒక్క దర్శనంతో కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాల గమనంలో ఎన్నో శతాబ్దాలు దాటినా, ఈ ఆలయ ఆధ్యాత్మిక శక్తి ఏమాత్రం తగ్గలేదు. మానవ జన్మ ధన్యం కావాలంటే, జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి, ఆ త్రినేత్రుని కృపకు పాత్రులు కావాల్సిందే. వీలు చూసుకుని వచ్చే శివరాత్రికి లేదా కార్తీక పౌర్ణమికి ఈ అద్భుత క్షేత్ర దర్శనానికి ప్రణాళిక చేసుకోండి! జీవితంలో అద్భుతాలను చవిచూడండి.




