Kirata Varahi Devi: అప్పుల నుండి విముక్తి కలిగించి...ఐశ్వర్యాన్ని పెంచే కిరాత వారాహి
గుప్త నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారిని కిరాత వారాహిగా ఆరాధిస్తారు. అమ్మవారి ఆరాధనతో అప్పుల బాధలు, శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి.
Kirata Varahi Devi: జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, తీరని అప్పుల భారంతో నలిగిపోతున్న వారికి, సమస్త సంపదలను ప్రసాదించే దివ్య అవతారమే 'కిరాత వారాహి'. లలితా పరాభటారికా సైన్యాధ్యక్షురాలైన వారాహి దేవిని ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో ఉపాసించడం అత్యంత ఫలదాయకమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ గుప్త నవరాత్రులలో ముఖ్యంగా ఐదో రోజున అమ్మవారిని 'కిరాత వారాహి' రూపంలో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ పవిత్రమైన రోజున వరిపిండి, బెల్లంతో చేసిన ప్రత్యేక దీపాన్ని వెలిగించి, అమ్మవారి దివ్య మంత్రాన్ని జపించడం వల్ల ఎటువంటి శని దోషాలైనా తొలగిపోతాయి. అంతేకాదు, పేరుకుపోయిన అప్పుల బాధల నుండి విముక్తి కలిగి, ఇంట్లో ధనకనక వస్తు వాహనాది ఐశ్వర్యం నిలకడగా పెరుగుతుంది.
శని దోషాలను పటాపంచలు చేసే వరిపిండి దీపం
గుప్త నవరాత్రులలో ఐదవ రోజున కిరాత వారాహికి సమర్పించే దీపానికి ఒక ప్రత్యేకత ఉంది. వరిపిండి, బెల్లంతో తయారు చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల జీవితంలో వేధిస్తున్న నవగ్రహ దోషాలు, ముఖ్యంగా తీవ్రమైన శని గ్రహ దోషాలు క్షణాల్లో తొలగిపోతాయి.
అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం... కామిత ఫలదాయకం
కిరాత వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం చక్కెర లేదా బెల్లంతో తయారు చేసిన 'పొంగలి'. సంతానం లేని దంపతులు, వ్యాపారంలో నష్టాల్లో ఉన్నవారు, పెళ్లిళ్లు కాక ఇబ్బంది పడుతున్నవారు ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే అనుకున్న కోరికలు వెంటనే సిద్ధిస్తాయని నిష్ణాతులైన పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రోజున పూజా సమయంలో మనస్సును ఏకాగ్రతతో ఉంచి ఓం నమో కిరాత వారాహ్యై ధన ధాన్యం ప్రదేహి మే ఐశ్వర్యం దేహి దేహి స్వాహా అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు పఠించాలి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని అచంచలమైన విశ్వాసంతో పఠించడం వల్ల చేతిలో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. వ్యాపారాభివృద్ధి జరిగి ధనాగమ మార్గాలు సుగమమవుతాయి. అమ్మవారిపై పూర్తి భారం వేసి ఈ ఉపాసన చేసే సాధకులకు సర్వత్ర విజయం చేకూరుతుంది. మరెందుకు ఆలస్యం ఈరోజు కిరాత వారాహి దేవిని చెప్పిన విధంగా పూజించి బాధల నుంచి విముక్తి పొందండి. అన్నింటా విజయం లభిస్తుంది.




