Mahabharatam: మహాభారతంలో నీతికథ...ఎవరితో ఎలా ఉండాలో ఈ కథే నిదర్శనం
మహాభారతంలోని పిల్లి–ఎలుక నీతికథ మానవ సంబంధాల్లో ఎవరితో ఎలా ఉండాలో చెబుతుంది. ఆపదలో శత్రువుతో ఎలా వ్యవహరించాలి అనే అంశాలు మనకు తెలియజేస్తుంది.
Mahabharatam:మహాభారతంలోని శాంతిపర్వంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి బోధించిన పిల్లి-ఎలుక నీతి కథ మానవ సంబంధాలకు, లోకరీతికి చక్కని దిశానిర్దేశం చేస్తుంది. ఈ ప్రపంచంలో శాశ్వత శత్రువులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరు. కేవలం 'స్వార్థం' లేదా 'అవసరం' మాత్రమే సంబంధాలను నిర్ణయిస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. ఆపద సమయంలో తెలివితో ఎలా వ్యవహరించాలి, అవసరం తీరిన తర్వాత స్వార్థపరులైన శత్రువుల నుండి ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలో ఈ కథ ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
ఆపదలో శత్రువులతో పొత్తు
ఒక అడవిలోని చెట్టు తొర్రలో లోమశుడు అనే పిల్లి, అదే చెట్టు కింద కలుగులో పలితుడు అనే ఎలుక నివసించేవి. ఒకరోజు వేటగాడు పరిచిన వలలో పిల్లి చిక్కుకుంది. పిల్లి ఆపదలో ఉందని ఎలుక ఆనందించే లోపే, దానిని వేటాడేందుకు గుడ్లగూబ, ముంగిస అక్కడికి వచ్చాయి. ఒకవైపు పిల్లి, మరోవైపు ముంగిస-గుడ్లగూబల ముప్పుతో చుట్టుముట్టబడిన ఎలుక చాకచక్యంగా ఆలోచించింది. పిల్లి వద్దకు వెళ్ళి, తనను ఆ రెండింటి నుండి రక్షిస్తే, వలను కొరికి పిల్లిని కాపాడుతానని షరతు విధించింది. పిల్లి దానికి అంగీకరించింది.
చాకచక్యం ... సమయస్ఫూర్తి
పిల్లి ఎలుకకు ఆశ్రయం ఇవ్వడంతో ముంగిస, గుడ్లగూబ అక్కడ నుండి వెళ్లిపోయాయి. పిల్లి వెంటనే వలను కొరకమని తొందరపెట్టింది. కానీ ఎలుక వేటగాడు వచ్చే వరకు వేచి చూసి, చివరి క్షణంలో వల తాళ్లను కొరికింది. ఒకేసారి వల కొరికితే పిల్లి తన్ను తినేస్తుందని గ్రహించిన ఎలుక, తన ప్రాణ రక్షణ కోసం వేటగాడి రాకను ఆసరాగా చేసుకుని పిల్లి దృష్టిని మళ్లించింది.
స్వార్థపు స్నేహానికి స్వస్తి ... శుక్రనీతి
వల నుండి బయటపడిన పిల్లి, "మనం ఒకరినొకరు కాపాడుకున్నాం కాబట్టి ఇకపై ప్రాణస్నేహితులుగా ఉందాం" అని ఎలుకను నమ్మించే ప్రయత్నం చేసింది. దానికి ఎలుక శాంతంగా స్పందిస్తూ... "మనం అవసరం కోసం మాత్రమే కలిసి ప్రయాణించాం. ప్రకృతి సిద్ధంగా మనం శత్రువులం. ఆకలి వేస్తే నువ్వు నన్ను తినేయవు అని నమ్మకం లేదు. ఆపద దాటాక కూడా శత్రువుతో స్నేహం కొనసాగిస్తే నాశనం తప్పదని 'శుక్రనీతి' చెబుతోంది" అని స్పష్టం చేసి తన కలుగులోకి వెళ్లిపోయింది.
మానవ జీవితంలో ఎదురయ్యే మనుషులను సరిగ్గా అంచనా వేయడానికి ఈ కథ ఒక మార్గదర్శి. అవసరం కోసం దగ్గరయ్యే శత్రువులతో ఆపద సమయంలో ఉపాయంతో వ్యవహరించాలి. అయితే ఆ పని పూర్తయిన వెంటనే, ఆత్మాభిమానం, ఆత్మరక్షణ కోసం అలాంటి సంబంధాలకు స్వస్తి చెప్పడమే ఉత్తమమైన మార్గం.




