Lakshmi Narasimha Temple: సికింద్రాబాద్ లక్ష్మీనరసింహుడు...కాపలాగా 20 అడుగుల శ్వేతనాగు
సికింద్రాబాద్కు కూతవేటు దూరంలో మహేంద్రగిరి హిల్స్లో వెలసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నవారి కోరికలు నెరవేరడమే కాకుండా, స్వామివారి కృపతో వివాహయోగం కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం.
Lakshmi Narasimha Temple: భక్తుల పాలిట కల్పవృక్షం, దుష్టశిక్షణకు నిదర్శనం శ్రీమహావిష్ణువు ఎత్తిన నారసింహ అవతారం. హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాదుడిని రక్షించిన ఆ భగవంతుడు సాధారణంగా కొండ గుహలలోనే కొలువై ఉంటాడు. అలాంటి ఒక పరమ పవిత్రమైన పురాతన గుహాలయం భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని మహేంద్రగిరి హిల్స్లో ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం ఇక్కడి కొండపై లక్ష్మీదేవి సమేతంగా స్వయంభూవుగా వెలిసిన ఈ జయగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. అలాగే ఆలయ రక్షణగా 20 అడుగుల రహస్య శ్వేతనాగు కాపలా ఉంటుందని భక్తుల బలమైన నమ్మకం.
భక్తురాలి కోసం తరలివచ్చిన యాదాద్రి నాథుడు
పూర్వం ఈ ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామిని అమితంగా ఆరాధించే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె ప్రతిరోజూ కాలినడకన అంత దూరాన ఉన్న యాదాద్రి క్షేత్రానికి వెళ్లి స్వామివారిని సేవించుకునేది. వృద్ధాప్యం పైబడిన తరుణంలో ఆమె శరీరం సహకరించకపోయినా శ్రమకోర్చి ప్రయాణం చేస్తుండటంతో, భక్తసులభుడైన ఆ నరసింహుడు ఆమె కలలో సాక్షాత్కరించాడు. "నీవు అంత దూరం రానవసరం లేదు.. నేను ఇక్కడే కొండపై ఉన్న గుహలో లక్ష్మీ సమేతుడనై అవతరించి ఉన్నాను" అని ఆనతిచ్చాడు. మరుసటి రోజు ఉదయం కొండపైకి వెళ్లి చూడగా అక్కడ స్వామివారి స్వయంభూ మూర్తి దర్శనమిచ్చింది.
క్షేత్రపాలకుడిగా 20 అడుగుల శ్వేతనాగు
ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరొక అతిపెద్ద విశేషం ఉంది. ఈ పవిత్ర క్షేత్రానికి రక్షకుడిగా, క్షేత్రపాలకుడిగా సుమారు 20 అడుగుల పొడవున్న ఒక శ్వేతనాగు కాపలాగా ఉంటుంది. స్వామివారి గుహ అంతర్భాగంలో ఈ శ్వేతనాగు సంచరిస్తూ ఉంటుందని చెబుతారు. సాధారణ భక్తులకు ఇది అదృశ్య రూపంలో ఉన్నప్పటికీ, నిష్కల్మషమైన భక్తితో పూర్వజన్మ సుకృతం చేసుకున్న కొద్దిమంది భక్తులకు, అర్చకులకు మాత్రమే కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ శ్వేతనాగు దర్శనమిస్తుందని పండితులు చెబుతుంటారు.
ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు, విశేష పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చుట్టూ కొండలు, పచ్చదనంతో నిండిన మహేంద్రగిరి హిల్స్ క్షేత్రం మానసిక ప్రశాంతతకు నిలయంగా మారింది. జంటనగరాల భక్తులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే, శతాబ్దాల నాటి ఈ దివ్య గుహాలయాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు.




