Mystery Shiva Temple: వందల ఏళ్లుగా అద్భుతం..శివాలయంలో రహస్యపూజ...ఎవరు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
మన భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని దేవాలయాల రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయాయి. శివాలంలో 400 ఏళ్లుగా రహస్యపూజ జరుగుతున్నది. ఎవరు చేస్తున్నారో ఎవరూ కనిపెట్టలేకపోయారు.
Mystery Shiva Temple: మన భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని దేవాలయాల రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయాయి. సైన్స్ సైతం వీటిని కనుగొనలేకపోతున్నది. అలాంటి ఓ అద్భుతం సుమారు 400 ఏళ్లుగా ఒక పురాతన శివాలయంలో నిరంతరాయంగా సాగుతోంది. ప్రతిరోజూ తెల్లవారుజామున పూజారి వచ్చి ఆలయ తలుపులు తీసేసరికి, అక్కడ గర్భగుడిలో పరమశివునికి అప్పటికే ఘనంగా అభిషేకం జరిగి, బిల్వపత్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి ఉంటోంది. దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయంలో రాత్రి వేళ ఆ అదృశ్య పూజలు ఎవరు చేస్తున్నారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం.
దట్టమైన అడవిలో కొండపై వెలిసిన ఈశ్వరుడు
ఈ అద్భుతమైన ఆలయం ఉరానాలోని పహాట్ గేట్కు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక ఎత్తైన కొండ శిఖరంపై కొలువై ఉంది. చుట్టూ క్రూర మృగాలు తిరిగే అడవి మార్గం. ప్రతిరోజూ ఉదయం పూజారి కొండపైకి చేరుకుని, గర్భగుడి తాళాలు తీసి చూసేసరికి స్వామివారి లింగరూపం జలధారలతో తడిసి, ఎంతో శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి పూర్వం బంచ్వాల్ సింగ్ అనే రాజు తీవ్రంగా ప్రయత్నించారు. రాత్రి వేళ ఏం జరుగుతుందో కనిపెట్టడానికి తన ఆస్థాన గూఢచారులను, సైనికులను ఆలయం చుట్టూ కాపలాగా ఉంచారు. కానీ విచిత్రం ఏమిటంటే, తెల్లవారుజామున 4:00 గంటలు అయ్యేసరికి అక్కడ కాపలా ఉన్నవారంతా ఒక్కసారిగా స్పృహ కోల్పోయేవారు. మళ్లీ ఉదయం సూర్యోదయం అయ్యాకే వారికి మెలకువ వచ్చేది. అప్పటికే అక్కడ శివపూజ పూర్తయ్యేది.
బిల్వవృక్షం ఒక్కటే ఆధారమా?
స్థానిక ప్రజల కథనం ప్రకారం.. హిమాలయాల నుంచి ఒక అదృశ్య సిద్ధయోగి ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో ఇక్కడికి వచ్చి, తన యోగశక్తితో పూజలు చేసి వెళ్తుంటారని నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరో విశేషం కూడా దాగుంది. సాధారణంగా శివునికి పూజించే బిల్వపత్రానికి మూడు ఆకులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఆలయం పక్కనే ఉన్న బిల్వ వృక్షానికి మాత్రం విచిత్రంగా ఐదు నుంచి ఏడు ఆకుల సముదాయం కలిగిన బిల్వపత్రాలు కాస్తాయి. ఈ పరమ పవిత్రమైన పత్రాలతోనే రాత్రి వేళ ఆ సిద్ధపురుషుడు శివుని అర్చిస్తున్నాడని భక్తుల నమ్మకం. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసి, తెల్లవారుజామున జరిగే మొదటి దర్శనంలో పునీతులు కావడానికి వందలాది మంది భక్తులు తెల్లవారకముందే ఈ కొండపైకి చేరుకుంటారు. మానవ మాత్రులకు సాధ్యం కాని ఈ దైవిక రహస్యం, భగవంతుని ఉనికికి ఒక సజీవ నిదర్శనంగా నిలుస్తోంది.




