Navagraha Doshas: ఖర్చులేకుండానే నవగ్రహ దోషాల నుండి విముక్తి... ఈ పండ్లు చెబుతున్న రహస్యం
నవగ్రహాల అనుగ్రహం పొందడానికి జ్యోతిష్యశాస్త్రంలో పలు రకాలైన పరిష్కారాలు ఉన్నాయి. అందులో ఒకటి పండ్లను దానం ఇవ్వడం. ఏ దోషానికి ఎలాంటి పండును దానం ఇవ్వాలో తెలుసుకుందాం.
Navagraha Doshas: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల స్థితిగతులు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. జాతకంలో ఒక్క గ్రహం ప్రతికూలంగా ఉన్నా వివాహ జాప్యం, ఉద్యోగంలో అవరోధాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతుంటాయి. వీటి నివారణకు ఎంతోమంది ఖర్చుతో కూడుకున్న పూజలు, జపాలు చేస్తుంటారు. అయితే, అత్యంత సరళంగా, పైసా ఖర్చు లేకుండా కేవలం 9 రకాల ఫలాలను దానం చేయడం ద్వారా నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చని ప్రసిద్ధ గ్రంథం 'బృహన్నారదీయం' చెబుతోంది.
శ్లోక ప్రమాణం ... ఫలదాన విశిష్టత
నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి బృహన్నారదీయంలో వివరించిన దివ్య శ్లోకం:
"సూర్యాయ మాతులుంగంచ చంద్రాయ కదళీఫలం
కుజాయ దాడిమీ ఫలం బుధాయ ఆమ్రఫలం తథా
గురవే పనసంచైవ శుక్రాయ ఖర్జూరకం తథా
శనయే జంబూ ఫలంచైవ రాఘవే నారికేళకం
కేతవే మాతులింగంచ ఫలన్యేతాని కల్పయేత్"
ఏ గ్రహానికి ఏ పండు దానం ఇవ్వాలి?
శాస్త్ర ప్రకారం ఆయా గ్రహాల అనుగ్రహం కోసం నిర్దేశిత వారాల్లో ఈ పండ్లను దానం ఇవ్వాలి. సూర్యుని అనుగ్రహం కోసం ఆదిత్యునికి ప్రియమైన మాతులుంగ ఫలాన్ని అంటే పెద్ద నిమ్మ లేదా దబ్బ పండును ఆదివారం నాడు దానం ఇవ్వాలి. చంద్రగ్రహం అనుగ్రహం కోసం, మానసిక శాంతి, మానసిక బలం కోసం సోమవారం రోజున అరటి పండ్లను దానమివ్వడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, కుజగ్రహదోషం ఉన్నవారు, వివాహంలో అడ్డంకులు, ఉన్నవారు మంగళవారం రోజున దాడిమీ ఫలం అంటే దానిమ్మపండును దానం చేయాలి. ఇక బుధగ్రహ అనుగ్రహం కోసం... విద్య వ్యాపార రంగాల్లో పురోగతి కోసం బుధవారం రోజున మామిడి పండ్లను దానం చేయాలని పండితులు చెబుతున్నారు. గురు గ్రహ అనుగ్రహం పొందడానికి, వివాహ జాతకంలో బలం కోసం, గురువారం రోజున తాంబూలంలో పనసపండు తొనలను ఉంచి దానం ఇవ్వాలి. అంతేకాదు, కళారంగంలో గుర్తింపు పొందడం కోసం, సకమైన భోగాలు పొందడానికి శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం రోజున ఖర్జూర పండ్లను తాంబూలంలో దానం ఇవ్వాలి.
ఇక శనిగ్రహం అనుగ్రహం పొందడానికి ఏలినాటి శని, అష్టమ శని, శనిదోష నివారణకు శనివారం రోజున జంబూ ఫలాన్ని దానంగా ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. రాహువు అనుగ్రహం కోసం విదేశీ యత్నాలు నెరవేరడానికి, ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి శనివారం రోజున కొబ్బరికాయను దానం చేయాలి. అదేవిధంగా కేతుగ్రహం అనుగ్రహం కోసం ఆకస్మిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మంగళవారం రోజున దబ్బపండును దానం ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ప్రతికూల గ్రహాల దోష నివారణకు నిర్దేశిత రోజుల్లో నిష్కల్మషమైన భక్తితో ఫలదానం చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగి, జీవితంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకోకుండా సింపుల్గా ఇలా దానాలు చేయడం వలన కూడా దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.




