Planetary Dosha Remedies: ఎలాంటి మొండి దోషాలకైనా సులభమైన పరిష్కారం... ఇలా చేస్తే ఇల్లు స్వర్గసీమే
మనిషికి ఎదురయ్యే నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందేందుకు పూర్వీకులు రూపొందించిన అతి సులువైన, సులభమైన పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం.
Planetary Dosha Remedies: మనిషి తన జీవితంలో తెలిసో తెలియకో చాలా తప్పులు చేస్తుంటారు. ఇలా చేస్తున్న తప్పులకు, అదేవిధంగా జీవితంలో ఎదురయ్యే పలు రకాలైన సమస్యలకు ప్రధానకారణం జాతకంలోని నవగ్రహ దోషాలే అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. సాధారణ దోషాల మొదలు మొండి దోషాల వరకు మనల్ని ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ దోషాల నుంచి బయటపడేందుకు పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేయవలసిన అవసరం లేదు. మనం నిద్రపోయే రాత్రివేళ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మన పూర్వీకులు గ్రంథాల్లో పొందుపరిచిన ఆ అద్భుతమైన పరిహారాలేంటో తెలుసుకుందాం.
నవగ్రహ దోషాలు ... రాత్రివేళ అద్భుత పరిష్కారాలు
మన శరీరంలో, పరిసరాలలో ఉండే పంచభూతాల శక్తులను సమన్వయం చేయడానికి రాత్రి నిద్రపోయే సమయం అత్యంత అనుకూలమైనది. ఈ సమయంలోనే వాటి అనుగ్రహం కోసం కొన్ని రకాలైన పనులు చేయాల్సి ఉంటుంది. సూర్యగ్రహ దోషంతో ఇబ్బందిపడేవారు... మంచంకింద రాగి పాత్రలో నీటిని నింపి ఉంచాలి. ఇలా చేయడం వలన జాతకంలో సూర్యుడు బలపడతాడు. తండ్రితో విభేదాలు తొలగిపోతాయి. ఇక చంద్రగ్రహ దోషం నుంచి బయటపడేందుకు వెండి పాత్రలో నీటిని ఉంచి మంచంకింద ఉంచాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనవసరమైన భయాల నుంచి విముక్తి లభిస్తుంది. వివాహంలో ఆటంకాలు, భూమి సంబంధిత వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటే కుజదోషం ఉన్నట్టే. దీని నుంచి బయటపడేందుకు కంచుపాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచాలి. వ్యాపారంలో నష్టాలు, బుద్ధికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తితే బుధ గ్రహ దోషం ఉన్నట్టు. దీని నుంచి బయటపడేందుకు రాత్రివేళ దిండుకింద బంగారు ఆభరణాన్ని ఉంచితే సరిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా పసుపును ముద్దగా చేసి దానిని శుభ్రమైన వస్త్రంలో చుట్టి రాత్రివేళ తలగడ కింద ఉంచుకోవాలి. దీని ద్వారా గురుగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
రాహు, కేతు, శని దోష నివారణోపాయాలు
జీవితాన్ని అతలాకుతలం చేసే శని, రాహు, కేతువుల క్రూర దృష్టి నుండి తప్పించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి. భార్యభర్తల మధ్య అన్యోన్యత, జీవితంలో సుఖసంతోషాలు పొందాలంటే వెండి చేపను రాత్రివేళ దిండుకింద ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక శనిగ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఇనుము పాత్రలో నీరుపోసి మంచం కింద లేదా నీలం రత్నాన్ని దిండుకింద ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఏలినాటి శని బాధలు, రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ప్రమాదాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ నుదిటిపై చందనం లేదా తిలకంతో బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన రాహువు శాంతిస్తాడు. ఇక కేతుగ్రహ శాంతి కోసం నోరులేని జీవులు, జంతువులు, పక్షులకు ఆహారం అందించాలి. ఇలా చేయడం వలన చర్యవ్యాధులు, శత్రు భయాలు తొలగిపోతాయి.
అయితే, మంచం కింద పాత్రలో రాత్రివేళ నీటిని ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా మొక్క పాదుల్లో పోయాలి. ఈ విధంగా నవగ్రహాల స్థితిని బట్టి ఈ తొమ్మి రకాల వస్తువులను ఉపయోగించి ఎలాంటి మొండి గ్రహ దోషాల నుంచైనా ఉపశమనం పొందవచ్చు. నమ్మకంతో ఈ పనులు చేయడం వలన తప్పకుండా జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు.




