Sri Krishnashtami: గోకులాష్టమి రోజున ఉట్టి ఎందుకు కొడతారో తెలుసా? రహస్యం ఇదే

శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి ఎందుకు కొడతారు? బాలకృష్ణుడి నవనీత చోర లీల, ఉట్టి వేడుక వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం.

Balachander
Published on: 3 Sept 2026 8:29 AM IST
Sri Krishnashtami: గోకులాష్టమి రోజున ఉట్టి ఎందుకు కొడతారో తెలుసా?  రహస్యం ఇదే
X

Sri Krishnashtami: శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన పవిత్ర తిథినే దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినాన ఆలయాలలో పూజలు, వ్రతాలతో పాటు వీధి వీధినా అత్యంత ఉత్సాహంగా నిర్వహించే ప్రధానమైన ఆచారం ఉట్ల తిరునాళ్లు. ఎత్తైన ప్రదేశంలో తాడుకు కట్టిన మట్టికుండను చేజిక్కించుకునేందుకు యువకులు మానవ పిరమిడ్‌గా ఏర్పడి చేసే ఈ విన్యాసం వెనుక ద్వాపరయుగం నాటి చిన్ని కృష్ణుని లీలల వెనుక విశేషమైన అంతరార్థం దాగుంది.

ఉట్టి తయారీ, సంబరాల నిర్వహణ

కృష్ణాష్టమికి మూడు నుండి నాలుగు రోజుల ముందే భక్త బృందాలు, యువజన సంఘాలు ఏకమై ఊరంతా పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. ఇంటింటికీ తిరిగి ఆవుపాలు, పెరుగు, స్వచ్ఛమైన వెన్న, చిల్లర నాణేలను సేకరిస్తారు. సేకరించిన పాలు, వెన్న, నాణేలతో పాటు పసుపు నీళ్లను ఒక మట్టికుండలో నింపి, దానికి రంగులు అద్ది ఎత్తైన ప్రదేశంలో ఉట్టిగా వేలాడదీస్తారు. యువకులు ఒకరిపై ఒకరు ఎక్కుతూ ఉట్టిని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, చుట్టూ ఉన్న ప్రజలు వారిపై వసంతం చల్లుతూ స్వామివారి నామస్మరణలతో ప్రోత్సహిస్తారు. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు.

ద్వాపరయుగం నాటి కృష్ణ లీల

ద్వాపర యుగంలో రేపల్లెలోని గోపికల ఇళ్లలో బాలకృష్ణుడు తన గోపబాలురతో కలిసి చేసిన నవనీత చోర లీలయే ఈ ఆచారానికి మూలం. గోపికలు తమ ఇళ్లలోని పాలు, వెన్నను కన్నయ్య దొంగిలించకుండా ఉండటానికి, ఇంట్లోనే ఎవరికీ అందనంత ఎత్తున ఉట్టి కట్టి దానిపై వెన్న కుండలను దాచేవారు. జగన్నాథుడైన కృష్ణుడికి అది ఒక చిన్న ఆట. తన మిత్రులైన గోపబాలురను ఒకరిపై ఒకరిని నిలబెట్టి, వారి భుజాలపైకి ఎక్కి ఉట్టిలోని కుండలను పగలగొట్టి వెన్నను ఆరగించేవాడు. నల్లనయ్య చేసిన ఈ మధురమైన అల్లరిని, సమైక్యతా భావాన్ని తరతరాలకు గుర్తుచేయడానికే ఈనాటికీ మనం ఉట్ల పండుగను జరుపుకుంటున్నాం.

ఉట్ల వేడుకలోని ఆధ్యాత్మిక అంతరార్థం

ఉట్టి కొట్టే ఈ క్రతువు కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, మానవ జీవితానికి అవసరమైన మూడు ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది. ఒక్కరి వల్ల కానటువంటి కార్యం, పలువురు కలిసికట్టుగా శ్రమిస్తే సాధ్యమవుతుందనడానికి ఈ మానవ పిరమిడ్ గొప్ప నిదర్శనం. అంతేకాదు, పైన ఉన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కింద పడుతున్న నీటి ప్రవాహాలను, ఆటంకాలను తట్టుకుని నిలబడే నిరంతర సాధన ఇందులో కనిపిస్తుంది. భగవంతుడనే అమృతత్వాన్ని పొందాలంటే అహంకారాన్ని విడిచిపెట్టి, తోటివారి సహాయంతో ఊర్థ్వముఖంగా సాగాలనే తత్త్వాన్ని ఉట్టి మనకు బోధిస్తుంది. గోకులంలో సాగిన ఆనందతాండవాన్ని మన కళ్లముందు నిలిపే ఈ ఉట్ల మహోత్సవం ప్రతి ఒక్కరిలో భక్తిపారవశ్యాన్ని, సామాజిక సమరసతను పెంపొందిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story