Veerapandi Kaumariamman Temple: తమిళనాడులో అద్భుతం... కంటిచూపును ప్రసాదిస్తున్న అమ్మవారు
తమిళనాడులోని వీరపాండి కౌమారి అమ్మాన్ ఆలయం కంటి చూపును ప్రసాదించే ఆమ్మవారిగా ప్రసిద్ది పొందారు. పూర్వం వీరపాండ్యన్ అనే రాజుకు కంటిచూపును ప్రసాదించగా గ్రామానికి వీరపాండి అనే నామకరణం చేశాడు.
Veerapandi Kaumariamman Temple: ఆలయాలకు నిలయమైన తమిళనాడు రాష్ట్రంలో ప్రతి దివ్య క్షేత్రం వెనుక ఒక అద్భుతమైన స్థల పురాణం దాగి ఉంది. అందులోనూ తేని జిల్లా, కంబం లోయ నడిబొడ్డున ముల్లై పెరియార్ నదీ తీరాన వెలసిన 'వీరపాండి శ్రీ కౌమారియమ్మన్' దేవాలయం భక్తుల గుండెల్లో ఒక గొప్ప నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. తీవ్రమైన నేత్ర వ్యాధులతో బాధపడేవారు, కంటిచూపు కోల్పోయినవారు ఈ అమ్మవారిని దర్శించుకుని, తీర్థం స్వీకరిస్తే నయం కాని దృష్టి లోపాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఆలయ చారిత్రక నేపధ్యం ... పాండ్య రాజు తపస్సు
చాలా శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన వీరపాండ్యన్ అనే పాండ్య రాజు తన పూర్వజన్మ కర్మఫలం కారణంగా రెండు కళ్ల చూపును పూర్తిగా కోల్పోయాడు. దృష్టిని తిరిగి పొందడానికి దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలు తిరిగినా ఫలితం లేకపోయింది. చివరికి ముల్లై పెరియార్ నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర ప్రాంతానికి చేరుకుని కౌమారి మాతను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు ఆచరించాడు. రాజు అచంచలమైన భక్తికి కరిగిన అమ్మవారు ప్రత్యక్షమై, అతనికి తిరిగి కంటిచూపును ప్రసాదించింది. తనకు చూపునిచ్చిన జగన్మాతకు కృతజ్ఞతగా రాజు ఆ గ్రామానికి తన పేరు మీదుగా 'వీరపాండి' అని నామకరణం చేసి, నేడు మనకు కనిపిస్తున్న ఈ బృహత్తర ఆలయాన్ని నిర్మించాడు.
వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు ... విలక్షణ మొక్కుబడులు
ప్రతి సంవత్సరం తమిళ మాసాలైన చిత్తిరై, వైశాఖి మాసంలో ఈ ఆలయంలో ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు విలక్షణమైన పద్ధతుల్లో తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. కోరికలు నెరవేరిన భక్తులు చేతులతో నిప్పుల కుండలను పట్టుకుని ఆలయం చుట్టూ ఊరేగింపుగా వస్తారు. మశూచి, పొంగు వంటి చర్మవ్యాధుల నుండి ఉపశమనం పొందిన భక్తులు చిన్న చిన్న రంధ్రాలు ఉన్న 'వెయ్యి కళ్ల కుండను' తలపై మోస్తూ అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారు. అంతేకాదు, ఇక్కడ మరో ఆచారం కూడా ఉంటుంది. శరీర రుగ్మతలు తొలగిపోవడానికి, పంటలు సమృద్ధిగా పండడానికి భక్తులు శరీరమంతా బురద పూసుకుని అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఇక శ్రీ సుబ్రమణ్య స్వామి శక్తి స్వరూపమైన ఈ కౌమారి మాతకు నెమలి వాహనంగా, కోడి ధ్వజ చిహ్నంగా ఉంటాయి. వీరత్వానికి ప్రతీకయైన ఈ తల్లి, ముల్లై పెరియార్ పవిత్ర జలాలతో చేసే అభిషేక తీర్థాన్ని స్వీకరించే భక్తుల సకల రోగాలను హరించి వేస్తుందని నమ్మకం.




