Tantania Kali Temple: వింత ఆచారం - తంతానియా కాళికి రొయ్యలే నైవేద్యం

ల్‌కతా నగరం అంటే మనకు గుర్తుకు వచ్చేది కాళికాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కాళికాదేవి ఉగ్రదేవత. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కూడా సాత్వికంతో పాటు తామస గుణాలను కలిగించేవి కూడా ఉంటాయి.

Balachander
Published on: 29 April 2026 9:28 AM IST
Tantania Kali Temple: వింత ఆచారం - తంతానియా కాళికి రొయ్యలే నైవేద్యం
X

Tantania Kali Temple: కోల్‌కతా నగరం అంటే మనకు గుర్తుకు వచ్చేది కాళికాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కాళికాదేవి ఉగ్రదేవత. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కూడా సాత్వికంతో పాటు తామస గుణాలను కలిగించేవి కూడా ఉంటాయి. కోల్‌కతాలోని 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఓ పురాతన కాళీకాదేవి అమ్మవారికి నైవేద్యంగా రొయ్యలను నైవేద్యంగా సమర్పిస్తారంటే నమ్మశక్యం కాదు కదా. ఇలా నమ్మశక్యంకాని ఆలయం తంతానియా కాళీబారి ఆలయం. మూడు వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

తంతానియా కాళీబారి- రొయ్యల నైవేద్యం వెనుక ఉన్న భక్తి రహస్యం

భారతదేశంలో శక్తి ఆరాధన అధికం. అందులోనూ ఉత్తరభారతదేశంలోని పశ్చిమబెంగాల్‌లో ఈ ఆరాధన ఎక్కువ. శక్తిని కాళికాదేవి రూంలో ఆరాధిస్తారు. కోల్‌కతా వీధుల్లో నడుస్తుంటే మనకు ఎన్నో కాళికాదేవి ఆలయాలు కనిపిస్తాయి. బీడన్‌ స్ట్రీట్‌ సమీపంలోని తంతానియా కాళీబారి ఆలయం మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని సిద్దేశ్వరి దేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారికి రొయ్యల కూరను నైవేద్యంగా సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. అసలు ఈ అమ్మవారి కథేంటో తెలుసుకుందాం.

323 ఏళ్ల నాటి చరిత్ర (1703 - 2026)

ఈ ఆలయం గురించి తెలియాలంటే మనం 1700 సంవత్సరం కాలానికి వెళ్లాలి. 1703లో ఉదయ నారాయణ బ్రహ్మచారి అనే గొప్ప తాంత్రికుడు ఈ ఆలయంలో సిద్దేశ్వరి దేవిని ప్రతిష్టించారు. అప్పట్లో ఈ ప్రాంతం అడవితో నిండిపోయింది. దొంగల భయం ఎక్కువ. దీంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయంలోని గంటలను ప్రజలు పెద్ద పెద్దగా మోగించేవారు. ఇలా ఆలయంలోని గంటలను మోగించినపుడు తన్‌ తన్‌ అనే శబ్దం వస్తుండేది. దీంతో ఈ ఆలయాన్ని అప్పటి నుంచి తంతానియా అని పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరు మీదుగానే ఇప్పుడు ఈ ఆలయాన్ని తంతానియా కాళీబరిగా పిలుస్తున్నారు.

రొయ్యల నైవేద్యం ఎలా మొదలైంది?

సాధారణంగా మనం దేవతలకు పూలు, పళ్లు, సాత్విక నైవేద్యాలను సమర్పిస్తాం. కానీ, ఇక్కడ అమ్మవారికి దాబ్‌ చింగ్రి అనే లేత కొబ్బరి బొండంలో వండిన రొయ్యల కూరను నైవేద్యంగా పెడతారు. దీనికి ఆధ్యాత్మిక గురువు పరమహంస జీవితానికి సంబంధం ఉంది. ఒకప్పుడు ప్రముఖ సామాజిక వేత్త కేశవ చంద్రసేన్‌ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. రామకృష్ణ పరమహంసకు అత్యంత సన్నిహితుడు కావడంతో, ఆయన కోలుకోవాలని చెప్పి రామకృష్ణ పరమహంస ఈ సిద్దేశ్వరి దేవిని పూజించారు. అమ్మవారికి ఇష్టమైన రీతిలో రొయ్యల కూర వంటకాన్ని సమర్పించారు. ఇలా చేసిన తరువాత కేశవ చంద్రసేన్‌ కోలుకున్నారు. అప్పటి నుంచి కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి ఇలా ప్రత్యేకంగా మాంసాహారం నైవేద్యాలను సమర్పించడం ప్రారంభించారు.

ఆధ్యాత్మిక నియమం

అయితే ఇక్కడ ఒక విలక్షణమైన నియమం ఉంది. మామూలు రోజుల్లో మాంసాహారం పెట్టినప్పటికీ, కాళీ చతుర్దశి, ఫలహారిణి అమావాస్య వంటి అత్యంత పవిత్రమైన రోజుల్లో మాత్రం కేవలం శాకాహార నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు. కాళీ చతుర్ధశి, ఫలహారిణి అమావాస్య అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. ఆరోజున పెద్ద సంఖ్యలో భక్తులు సిద్దేశ్వరి దేవిని దర్శించుకొని శాఖాహారాన్ని సమర్పిస్తారు. కోల్‌కతాలోనే చైనాకాళీ ఆలయంలో కూడా ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటాయి. అక్కడ అమ్మవారికి పాస్తా, నూడిల్స్‌ వంటి వాటిని సమర్పిస్తారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story