Puri Rath Yatra: ఎన్ని కష్టాలు ఎదరైనా...పూరీలో ఒక్కసారి ఇలా చేయండి చాలు...మీకన్నా అదృష్టవంతులు ఉండరు
పూరీ జగన్నాథ రథయాత్రలో రథం తాడును తాకడం ఎందుకు అత్యంత పుణ్యకరంగా భావిస్తారు? నందిఘోష, తలధ్వజ, దర్పదలన రథాల విశిష్టత, రథ తాళ్ల ఆధ్యాత్మిక రహస్యాలు, భక్తులకు లభించే దివ్యమైన ఫలితాలను గురించి తెలుసుకుందాం.
Puri Rath Yatra: పూరీ జగన్నాథుని రథయాత్ర అనగానే కోట్లాది మంది భక్తుల గుండెల్లో ఒక అలౌకిక భక్తిభావం ఉప్పొంగుతుంది. ఆషాఢ మాసంలో జరిగే ఈ మహోత్సవంలో పాల్గొనడం, ఆ జగన్నాథుడి రథాన్ని కళ్లారా చూడటం ఒక ఎత్తైతే, ఆ రథాన్ని లాగే తాళ్లను ఒక్కసారి తాకడం జీవితాన్నే మార్చేసే పరమ పవిత్రమైన ఘట్టం. ఎన్ని కష్టాలు ఎదురైనా, పూరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ రథం తాడును ఒక్కసారి స్పృశిస్తే చాలు... మీకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఎందుకంటే, ఆ తాడును తాకడం అంటే ఆ పరమాత్ముని హస్తాన్ని పట్టుకోవడమే!
మూడు రథాలు ... మూడు దివ్యమైన తాళ్లు
ఈ రథయాత్రలో మూడు ప్రధాన రథాలు ఉంటాయి. ప్రతి రథానికి రెండు చొప్పున మొత్తం ఆరు పొడవైన, ధృడమైన తాళ్లను కడతారు. అయితే, మనకు కేవలం తాళ్లుగా కనిపించే ఆ బంధాలకు వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం, విశిష్టమైన పేర్లు ఉన్నాయి. జగన్నాథుడు కొలువయ్యే రథం పేరు నందిఘోష. ఈ రథానికి కట్టే తాడును శంఖచూడుడు అని పిలుస్తారు. ఇక బలరాముడి రథం పేరు తలధ్వజ. దీనికి కట్టే తాడును వనూలి అని పిలుస్తారు. ఇక సుభద్రాదేవి రథం పేరు దర్పదలన కాగా, ఈ రథానికి కట్టే తాడును స్వర్ణచూడ అని పిలుస్తారు.
తాడును తాకితేనే యాత్ర సంపూర్ణం!
సాధారణంగా దేవుడి గర్భగుడిలోకి అందరికీ ప్రవేశం ఉండదు. కానీ, ఈ రథయాత్ర విశిష్టత ఏమిటంటే, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క భక్తుడికీ ఆ స్వామిని సేవించుకునే భాగ్యం దక్కుతుంది. ఈ యాత్రలో రథం తాడును తాకి లాగడం వల్ల మరుజన్మ అంటూ లేకుండా, జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లి, ఆ స్వామి రథం తాడును కనీసం ఒక్కసారైనా తాకకుండా తిరిగి వస్తే... ఆ యాత్ర సంపూర్ణం కానట్లేనని భక్తుల నమ్మకం. జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా... వాటన్నింటినీ తుడిచిపెట్టే శక్తి ఆ ‘రథ తాడు’ స్పర్శకు ఉంది. ఈ ఏడాది మీరు కూడా పూరీ యాత్రకు సిద్ధమై, ఆ దివ్య తాళ్లను తాకి, జగన్నాథుని పరిపూర్ణ కృపకు పాత్రులు అవ్వండి.




