Tuljapur Bhavani Temple: భక్తురాలికోసమే వెలిసిన అమ్మవారు...అడిగింది నిజమైతే ఆ శిల కదులుతుంది
భక్తురాలి కోరిక మేరకు, అసురుడిని సంహరించిన తుల్జాపూర్ భవానీ ఆలయం ఓ అద్భుతం. నిత్యం కదిలే చింతామణి శిలను చూసి తీరాల్సిందేనని అంటున్నారు భక్తులు.
Tuljapur Bhavani Temple: భారతదేశంలో కొలువైన శక్తిపీఠాల్లో మహారాష్ట్ర, ఉస్మానాబాద్ జిల్లా యమునాచల శిఖరంపై వెలసిన తుల్జాపూర్ భవానీ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. త్వరితగతిన భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారు, 12వ శతాబ్దం నుంచి మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబానికి ఇలవేల్పుగా పూజలందుకుంటోంది. నిస్సహాయురాలైన ఒక భక్తురాలి మొర విని స్వయంభూగా వెలసిన ఈ శక్తిస్వరూపిణి, నేటికీ అనేక దివ్య అద్భుతాలకు నిలయంగా భాసిల్లుతోంది.
స్థల పురాణం... సాధ్వి అనుభూతి కథ
స్కంద పురాణం ప్రకారం, మహిషాసుర సంహారార్థం ఆవిర్భవించిన భవానీదేవి ఇక్కడ స్థిరపడటానికి ఒక ఆధ్యాత్మిక కథ ఉంది. ప్రాచీన కాలంలో అనుభూతి అనే సాధ్వి తన చిన్న బిడ్డతో యమునాచల శిఖరంపై తపస్సు చేసుకుంటుండగా, ఒక రాక్షసుడు ఆమెకు ఆటంకం కలిగించబోయాడు. సాధ్వి నిస్సహాయంగా చేసిన ఆర్తనాదం విన్న జగజ్జనని వెంటనే సాక్షాత్కరించి ఆ అసురుడిని వధించింది. భక్తురాలి కోరిక మేరకు అమ్మవారు ఇక్కడే స్వయంభూగా ఉండిపోగా, తదనంతర కాలంలో మహామండలేశ్వర మరాదాదేవ అనే రాజు ఆలయాన్ని నిర్మించారు. తరువాత ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు.
ఆలయ ప్రత్యేకతలు ... కదిలే దివ్య శిల 'చింతామణి'
తుల్జాపూర్ భవానీ ఆలయంలో దర్శనమిచ్చే ప్రతీ ఘట్టం ఒక అద్భుతం. అష్టభుజాలతో స్వర్ణాభరణాల శోభతో ప్రకాశించే అమ్మవారి మూడు అడుగుల మూలవిరాట్టును పీఠంతో కలిపి ఉంచలేకపోయారు. అందువల్ల విగ్రహం స్వల్పంగా కదులుతుందని క్షేత్ర పూజారులు చెబుతారు. ఆలయంలో గుండ్రని 'చింతామణి' రాయి ఉంది. భక్తులు తమ మనసులోని కోరిక లేదా ప్రశ్నను తలచుకుని ఆ రాయిపై చెయ్యి ఉంచితే... సమాధానం 'అవును' అయితే ఆ శిల కుడివైపుకి, 'కాదు' అయితే ఎడమవైపుకి కదులుతుంది. శివాజీ మహారాజ్ కూడా యుద్ధానికి వెళ్లేముందు ఈ శిల వద్దే అమ్మవారి ఆజ్ఞ తీసుకునేవారని చెబుతారు. అంతేకాదు, అమ్మవారి శయనం కోసం గర్భగుడిలో వెండి మంచం ఉంటుంది. అంతేకాదు, పరాశక్తి ఏడాదికి మూడుసార్లు గర్భాలయం వీడి భక్తులకు స్వయంగా దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ఇలాంటి ఎన్నో విశేషాలు తుల్జాపూర్ భవానీ ఆలయంలో మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాలని భక్తులు చెబుతున్నారు.




