Vaishakha Masam 2026: వైశాఖమాసంలో వచ్చే పండుగలు పర్వదినాలు ఇవే
Vaishakha Masam 2026: శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు.
Vaishakha Masam 2026: వైశాఖమాసంలో వచ్చే పండుగలు పర్వదినాలు ఇవే
Vaishakha Masam 2026: హైందవ సంప్రదాయంలో చైత్ర మాసానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ఆ తరువాత వచ్చే వైశాఖ మాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో దానధర్మాలకు, పవిత్ర స్నానాలకు, జ్ఞానబోధకు, మహాపురుషుల జయంతి ఉత్సవాలకు ప్రసిద్ది. ఈ మాసాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే అద్భుతమైన కాలంగా కూడా చెబుతారు. వైశాఖమాసం ఏప్రిల్ 18న ప్రారంభమై మే 16తో ముగియనున్నది. ఈ నెల రోజుల కాలంలో ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు భక్తి మార్గంలో పలు పండుగలు కూడా రానున్నాయి.
వైశాఖ శుక్ల పక్షంలో ఏప్రిల్ 18 మే 1 వరకు వచ్చే పర్వదినాలు
ఏప్రిల్ 20 (అక్షయ తృతీయ): ఈ మాసంలో అత్యంత కీలకమైన రోజు. కృతయుగం ప్రారంభమైన రోజుగా దీనికి గుర్తింపు ఉంది. అక్షయ తృతీయ నాడు చేసే ఏ చిన్న దానమైనా, పూజ అయినా అక్షయమై మనకు తిరిగి లభిస్తుంది. ఇదే రోజున పరశురామ జయంతి, సింహాచల అప్పన్న చందనోత్సవం ఘనంగా జరుగుతాయి.
ఏప్రిల్ 21, 22: అద్వైత సిద్ధాంత కర్త శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి . విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజాచార్యుల జయంతి. భారతీయ ఆధ్యాత్మికతను నిలబెట్టిన ఇద్దరు మహానుభావుల పుట్టినరోజులు ఈ మాసానికే వన్నె తెచ్చాయి.
ఏప్రిల్ 27 (మోహిని ఏకాదశి): క్షీరసాగర మథనం సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తిన పవిత్ర తిథి. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
ఏప్రిల్ 30 (నృసింహ జయంతి): హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి ఉద్భవించిన రోజు. భయం పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చే పర్వదినం ఇది.
మే 1 (బుద్ధ పూర్ణిమ): శాంతి కపోతం, అహింసా మూర్తి గౌతమ బుద్ధుడు జన్మించిన, జ్ఞానోదయం పొందిన పవిత్ర పూర్ణిమ. బుద్దుడు బోధించిన సూత్రాలను, జీవిత ధర్మాలను తెలుసుకొని ముందుకు సాగడం ఎంతో అవసరం. రోజుతో శుక్ల పక్షం ముగుస్తుంది.
వైశాఖ బహుళ పక్షంలో మే 2 నుంచి మే 16 వరకు వచ్చే పర్వదినాలు
మే 2 (అన్నమయ్య జయంతి): పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మదినం. తిరుమల వేంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు పాడారు. నేటికీ ఆ కీర్తనలను తిరుమలలో స్వామివారి కైంకర్య సేవలో ప్రధానంగా ఉండటం విశేషం.
మే 5 (తిరుపతి గంగ జాతర ప్రారంభం): లోకమాత గ్రామదేవత శక్తులకు ప్రతీకగా జరిగే జాతర. తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ జాతర చిత్తూరు, అన్నమయ్య, మదనపల్లి జిల్లాల్లో కొనసాగుతుంది. గ్రామదేవతను ఆరాధించడం వలన దక్షిణాయనంలో వచ్చే రుగ్మతల నుంచి బయటపడతారని అంటారు.
మే 12 (హనుమజ్జయంతి): తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. హనుమంతుని దీక్షలు విరమించే భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోతాయి.
మే 16 (అమావాస్య): ఈ రోజుతో వైశాఖ మాసం ముగిసి, మరుసటి రోజు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్టమాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమౌతుంది.




