Vastu Tips for Couples: మీ ఇంట్లో ఈ చిన్న మార్పులు చేయండి... గొడవలు తగ్గిపోయి భార్యభర్తలు లక్కలా అతుక్కుపోతారు
ఇంట్లో గొడవలు రోజురోజుకు పెరిగిపోయి విడిపోయేవరకు వస్తున్నాయంటే దానికి కారణం ఇంటి వాస్తునే. వాస్తులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గొడవలు తగ్గిపోయి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips for Couples: పూర్వం రోజుల్లో ఇంటిగుట్టు బయటకు వచ్చేది కాదు. భార్య భర్తల మధ్య కలహాలు పెద్దగా జరిగేవి కాదు. కారణం.. ఇంటి వాస్తు. ఆరోజుల్లో ఏ ఇల్లు అయినా సరే పక్కా వాస్తు ప్రకారమే నిర్మించుకునేవారు. కాలం మారేకొలది పట్టణాలు, నగరాలుగా రూపాంతరం చెందాయి. వాస్తుకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇల్లు దొరికితే చాలు అనుకుని కాలం గడుపుతున్నారు. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం లేకుంటే ఆ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. పెద్దలు ఎంత రాజీ చేసినా చివరకు విడిపోవడానికే మొగ్గు చూపుతుంటారు. ఇన్ని గొడవలకు కారణమైన వాస్తు నియమాలు ఏంటి...ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి తెలుసుకుందాం.
గొడవలకు కారణం
ఈరోజుల్లో చిన్న రిమోట్ కూడా భార్యభర్తల మధ్య కలహానికి కారణమౌతున్నది. అకారణంగా విడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలే..కానీ, వాటిని భూతద్దంలో పెట్టి చూసి విడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. పెద్దల రాజీ కుదిర్చినా ససేమిరా అంటున్నారు. అయితే, ఇలా గొడవలకు కారణాలు చాలా ఉంటాయని, అందులో ఒకటి వాస్తు దోషం కూడా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు.
దంపతుల పడకగది ఉత్తరదిశలో లేదా ఈశాన్యంలో ఉండటం వలన తరచుగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ దిశలను అశాంతి దిశలు అంటారు. ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదిని ఏర్పాటు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. దంపతుల మధ్య అనురాగం, బలమైన బంధం ఏర్పడాలంటే దక్షిణ పశ్చిమ దిశలో పడకగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దిశలో పడకగది లేకుంటే దాంపత్యంలో కలహాలు ఏర్పడతాయి. దంపతులు విడిపోయే అవకాశం ఉంటుంది. పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దాన్ని ఉంచడం మంచిది కాదు. మంచానికి ఎదురుగా అద్దం ఉంచుకోవడం వలన ఆ గదిలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది.
మానసిక ఒత్తిడి... ఒంటరితనం
ఉత్తర దిశను పితృదేవతల దిశగా చెబుతారు. ఈ దిశలో తలనుపెట్టి నిద్రపోకూడదని చెబుతారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విభేదాలు పెరిగిపోతాయి. పడకగదిలో ఎట్టిపరిస్థితుల్లోనూ నీలం, బూడిద రంగులు వేయకూడదు. ఈ రంగులు ఒంటరితనానికి చిహ్నం. మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పడకగదిలోని దక్షిణ తూర్పు లేదా ఈశాన్య దిశలో టాయిలెట్ ఉండకూడదు. ఇది పడకగదిలో శక్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా కూడా భార్యభర్తల మధ్య సంబంధాలు తెలిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ వాస్తు దోషాల నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని జపించాలి. పడక గదిలో శివపార్వతి లేదా రాధాకృష్ణుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఎవరైతే ఈ వాస్తు దోషాలను గుర్తించి పరిహారం చేసుకుంటారో వారింట్లో క్రమంగా గొడవలు తగ్గుముఖం పడతాయి. నకారాత్మక శక్తులు తగ్గిపోయి సకారాత్మక శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి వాతావరణం శాంతిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒకసారి ఇలా మార్పులు చేసి చూడండి. ఫలితం మీకే కనిపిస్తుంది.




