Temple:ఏడాదిలో మూడు రోజులు బ్రహ్మాపుత్ర నది ఎందుకు ఎర్రగా మారుతుంది?
Assam: అస్సాంలోని కామాఖ్య ఆలయంలో జరిగే అంబుబాచి మేళా సమయంలో బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారే ఘటన వెనుక విశ్వాసాలు మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
Kamakhya Temple
Kamakhya Temple:గౌహతిలోని నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య దేవాలయం ఇతర దేవాలయాల కంటే చాలా భిన్నమైనదినే విషయం తెలిసిందే. ఇది శక్తి స్వరూపమైన కామాఖ్య దేవికి అంకితం అయిన దేవాలయం. ఈమె సృష్టి, సంతానోత్పత్తి, ప్రకృతి చక్రాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ ఏ విగ్రహాన్ని పూజించరు, కానీ స్త్రీ శక్తికి, జీవానికి మూలంగా భావించే యోని ఆకారపు శిలను పూజిస్తారు.
అంబుబాచి మేళా..
ప్రతి సంవత్సరం, ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద జాతరలలో ఒకటైన అంబుబాచి మేళా ఇక్కడ జరుగుతుంది. ఈ కాలంలోనే కామాఖ్య దేవికి వార్షిక ఋతుస్రావం అవుతుందని నమ్ముతారు. విశ్రాంతి, శుద్ధీకరణ సమయంగా భావించే ఈ మూడు రోజులలో ఆలయ తలుపులు మూసి ఉంటాయి.
ఈ సమయంలో వేలాది మంది భక్తులు తరలివస్తారు, వాతావరణం అంతా భక్తితో నిండిపోయి ఉంటుంది. ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు లేత ఎరుపు రంగులోకి మారుతుందని, ఇది దేవత ఋతుస్రావానికి సంబంధించినదని పండితులు చెబుతారు. సాధారణంగా బహిరంగంగా చర్చించని విషయాలైన స్త్రీత్వం, సృష్టి శక్తి పట్ల గౌరవానికి ఈ సంప్రదాయం ప్రతీకగా నిలుస్తుంది.
కామాఖ్య దేవాలయం ఎందుకు ప్రత్యేకమైనది?
కామాఖ్య ఆలయం ప్రత్యేకత కేవలం దాని పూజా విధానాలలోనే కాకుండా, దానితో ముడిపడి ఉన్న పురాతన గాథలో కూడా ఉంది. పురాణాల ప్రకారం, సతీదేవి శివుడిని వివాహం చేసుకుంది, కానీ ఆమె తండ్రి అయిన దక్ష మహారాజు ఆ విషయంలో సంతోషంగా లేడు. దక్షుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించినప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా ఆ యఙానికి శివున్ని పిలవలేదు. ఈ అవమానాన్ని సహించలేక, సతీదేవి యజ్ఞకుండంలోకి దూకి తన ప్రాణాలను త్యాగం చేసింది.
ఈ సంఘటన గురించి శివుడు తెలుసుకున్నప్పుడు, ఆయన తీవ్రమైన కోపం, దుఃఖానికి లోనయ్యాడు. ఆయన సతీదేవి శరీరాన్ని తీసుకుని శివతాండవం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన ఉగ్రరూపం ఎంత భయంకరంగా ఉందంటే, యావత్ విశ్వం నాశనమయ్యే ప్రమాదంలో పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజించాడు.
సతీదేవి శరీర భాగాలు పడిన చోటల్లా శక్తి పీఠాలను స్థాపించారు. మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ ప్రదేశాలలో ఒకటి కామాఖ్య ఆలయం, ఇక్కడే సతీదేవి గర్భాశయం (యోని) పడింది. అందుకే ఈ ఆలయాన్ని స్త్రీ శక్తికి, సృష్టికి, ప్రకృతి అత్యంత ప్రాథమిక రూపానికి ప్రతీకగా భావిస్తారు.
రక్తంతో ముడిపడి ఉన్న విశ్వాసానికి ప్రతీక అయిన దేవత కామాఖ్య
కామాఖ్య దేవాలయం ఇతర దేవాలయాలకు పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ మీకు ఎలాంటి సాంప్రదాయ విగ్రహాలు గానీ, ఏ దేవత ముఖం లేదా విగ్రహం గానీ కనిపించవు. ఈ దేవాలయంలో ప్రధాన పూజా కేంద్రం యోని ఆకారంలో ఉన్న ఒక శిల. దీనిని స్త్రీ శక్తికి ప్రతీకగా మరియు సృష్టికి మూలమని భావిస్తారు. ఇది మొదట కొంచెం వింతగా లేదా ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
కానీ దీని వెనుక ఒక లోతైన సత్యం దాగి ఉంది. దేవాలయం లోపల, ఈ శిల ఒక గుహ లాంటి ప్రదేశంలో ఉంటుంది. అక్కడ ప్రవహించే సహజ వాగు దానిని ఏడాది పొడవునా తేమగా ఉంచుతుంది. పూజారులు, పూజారిణులు దానిని వస్త్రాలు, పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు.
ఇక్కడికి వచ్చే చాలా మంది మహిళలు గుహలోకి ప్రవేశించగానే, మాటల్లో వర్ణించలేని ఒక విశిష్టమైన శక్తిని తాము అనుభూతి చెందుతామని చెబుతారు. ఈ ఆలయంలోని అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే, ఋతుస్రావాన్ని దాచడం లేదా కించపరచడం కాకుండా, దానిని పవిత్రమైనదిగా పరిగణించడం. చాలా ప్రదేశాలలో ఈ విషయంపై చర్చించడాన్ని కూడా తప్పుగా భావిస్తుండగా, ఇక్కడ దానిని దేవత శక్తి గా చూస్తారు.
బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారింది
ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలైలో జరిగే అంబుబాచి మేళా సమయంలో, కామాఖ్య ఆలయ ద్వారాలను మూడు రోజుల పాటు మూసివేస్తారు. ఈ సమయంలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని నమ్ముతారు. ఈ సమయంలో పూజారులు ఆలయంలోకి ప్రవేశించరు. అంతేకాకుండా అన్ని ఏర్పాట్లను మహిళా పరిచారికలే చూసుకుంటారు. ఈ సమయంలో, సమీపంలోని బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది, దీనిని అమ్మవారి ఋతుస్రావానికి సంకేతంగా భావిస్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించడానికి, ఆశీర్వాదం పొందడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
మూడు రోజుల తర్వాత, నాలుగో రోజున ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటాయి. అమ్మవారికి ప్రత్యేక స్నానం చేయించి పూజలు నిర్వహిస్తారు, అనంతరం భక్తులకు వస్త్రాలు లేదా పవిత్ర జలాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యం సంతానలేమి, ఆరోగ్య సమస్యలతో సహా పలు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. ఇది విశ్వాసం వల్ల జరుగుతుందా లేక మరేదైనా కారణం వల్ల జరుగుతుందా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆలయాన్ని సందర్శించే వారి అనుభవాలు ఈ సంప్రదాయాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి.
అసలు నది నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది?
కామాఖ్య ఆలయంలోని ఈ దృగ్విషయానికి శాస్త్రవేత్తలు అనేక వివరణలు ఇచ్చారు. ఆలయం చుట్టూ ఉన్న కొండలలో లభించే సింధూరం (ఒక ఎర్రటి ఖనిజం), వర్షాకాలంలో నీటిలోకి ప్రవహించి, దానికి ఎరుపు రంగును ఇస్తుందని కొందరు నమ్ముతారు. వర్షాకాలంలో పెరిగే ఒక నిర్దిష్ట రకమైన శైవలం దీనికి కారణం కావచ్చని ఇతర పరిశోధకులు సూచిస్తున్నారు.
వీటిలో ఏది నిజమో కచ్చితమైన సమాధానం లేదు. కానీ ఆసక్తికరంగా, ఈ విషయం ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా జరిగే సమయంలోనే సంభవిస్తుంది. బ్రహ్మపుత్ర నది నీరు ఆ మూడు రోజులు మాత్రమే ఎర్రగా కనిపిస్తుంది, మిగతా సమయాల్లో కాదు. అందువల్ల, కొందరు దీనిని ఒక అద్భుతంగా భావిస్తే, మరికొందరు దీనిని యాదృచ్ఛికం అంటారు. కానీ ఈ కథకు ఒక లోతైన కోణం ఉంది.
నేటికీ, సమాజంలో స్త్రీల శరీరాలు, ఋతుస్రావం గురించి బహిరంగంగా చర్చించరు, తరచుగా దీనిని సిగ్గుపడాల్సిన విషయంగా లేదా ఒక సమస్యగా చూస్తారు. కామాఖ్య ఆలయం ఈ ఆలోచనా విధానానికి పూర్తి విరుద్ధంగా నిలుస్తుంది. స్త్రీ శరీరం పవిత్రమైనదని, దాని సహజ చక్రాలు కూడా అంతే ముఖ్యమైనవని ఇది మనకు గుర్తు చేస్తుంది.




