Guru Bhakti: ఈతరం వారికోసమే...గురువులకు ఎందుకు పూజించాలో తెలుసా?
గురువులను నమ్మి పూజించి ఆరాధిస్తే వారి కృప వలన కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం.
Guru Bhakti: సనాతన ధర్మంలో గురువుకు ఇచ్చిన స్థానం అత్యున్నతమైనది. "గురురహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః..." అనే శ్లోకం కేవలం ప్రార్థన మాత్రమే కాదు, కౌత్సుడు అనే పరమ భక్తుడైన శిష్యుని నిశ్చల గురుభక్తి నుండి ఉద్భవించిన పవిత్రమూన మంత్రం ఇది. కాశీ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం మైమరపించి, క్షయ వ్యాధితో బాధపడుతున్న తన గురువు విద్యాధరునికి దివ్య మోక్షాన్ని ప్రసాదింపజేసిన కౌత్సుడి గాథ గురుసేవా మహత్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ దివ్య గాథ విశేషాలు, గురుపూజా ప్రాశస్త్యాన్ని వివరంగా తెలుసుకుందాం.
గురుసేవ ... కౌత్సుడి నిశ్చల సంకల్పం
పూర్వం విద్యాధరుడనే గురువు వద్ద కౌత్సుడు విద్యను అభ్యసించాడు. చదువు పూర్తయిన తర్వాత తన గురువు జాతకంలో భయంకరమైన క్షయ వ్యాధి రాబోతోందని గ్రహించి, ఆయనకు సేవ చేయడం కోసం కౌత్సుడు గృహస్థాశ్రమానికి వెళ్లకుండా ఆశ్రమంలోనే ఉండిపోయాడు. గురువుకు వ్యాధి సోకగా, ఆయనను కాశీ క్షేత్రానికి తీసుకెళ్లి ప్రజల అసహ్యాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శుశ్రూష చేశాడు.
త్రిమూర్తుల పరీక్ష ... దివ్య శ్లోకం ఆవిర్భావం
కౌత్సుడి గురుభక్తిని పరీక్షించేందుకు త్రిమూర్తులు వరుసగా మారువేషాల్లో వచ్చారు. బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు రోగగ్రస్తుడైన గురువును విడిచిపెట్టి వెళ్ళిపోమని సలహా ఇచ్చినా కౌత్సుడు తిరస్కరించాడు. అనంతరం ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగా ... "నా గురువును విడిచిపెట్టమని చెప్పడానికి ఎవరూ రాకుండా కాపలా ఉండు" అని కౌత్సుడు వేడుకున్నాడు. ఈ అపూర్వ గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై కౌత్సునికి మోక్షం ఇస్తామనగా, ఆయన నిరాకరించి ... "ఈ రోజు నాకు త్రిమూర్తుల దర్శనం లభించిందంటే దానికి కారణం నా గురువే. నా గురువే సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణువు, సంహారకుడు మహేశ్వరుడు" అని కొనియాడుతూ "గురుబ్రహ్మ గురువిష్ణుః..." శ్లోకాన్ని పఠించి, తన గురువుకే ప్రథమ మోక్షం కావాలని వేడుకున్నాడు.
గురు నమస్కార విధి ... ఆధ్యాత్మిక ఫలితాలు
గురువులకు సెల్యూట్ చేసినట్లుగా కాకుండా, రెండు చేతులు జోడించి తలవంచి నమస్కరించాలి. వీలైతే అష్ట అంగాలు నేలకు తాకేలా సాష్టాంగ నమస్కారం చేయడం అత్యంత ఉత్తమం. జ్యోతిష్యశాస్త్రపరంగా గురువుల అనుగ్రహం లభిస్తే జాతకంలో గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. గురువును నమ్మి సేవించిన భక్తులకు సాక్షాత్తు పరమేశ్వరుడే దిగివచ్చి అభయమిస్తాడని ఈ కథ నిరూపిస్తోంది. నేటి తరం ఈ గురు సంప్రదాయాన్ని గౌరవించి నడుచుకోవడం అత్యంత ఆవశ్యకం.




