ఇద్దరు కోచ్‌లు అవుట్.. మరొకరిపై బీసీసీఐ నజర్.. టీమిండియాలో ఏం జరుగుతోంది!

BCCI: BCCI is reportedly reviewing Team India head physio Kamlesh Jain. టీమిండియాలో వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Rishvik
Published on: 3 Aug 2026 6:46 PM IST
BCCI
X

ఇద్దరు కోచ్‌లు అవుట్.. మరొకరిపై బీసీసీఐ నజర్.. టీమిండియాలో ఏం జరుగుతోంది!

BCCI: టీమిండియాలో వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటేలు కోచింగ్ స్టాఫ్ నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు మెడికల్ సిబ్బందిపైనా బీసీసీఐ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హెడ్ ఫిజియో కమ్లేష్ జైన్ పనితీరుపై బోర్డు దృష్టి సారించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వరుస గాయాలతో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవుతుండటంతో బీసీసీఐ ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఈ గాయాల కారణంగా ప్రతి సిరీస్‌లోనూ భారత జట్టు తుది కూర్పులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాల తర్వాత ఫిట్‌నెస్ బృందంపై ప్రశ్నలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో 2022లో నితిన్ పటేల్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన హెడ్ ఫిజియో కమ్లేష్ జైన్ పనితీరుపై జట్టు యాజమాన్యం నుంచి అభిప్రాయాలు సేకరించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వరుస గాయాల సమస్యపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తరచూ ఆటగాళ్లు గాయపడుతుండటంతో పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించడం కష్టంగా మారిందని వారు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో పనిచేస్తున్న ఫిట్‌నెస్ నిపుణుల పనితీరుపైనా సమీక్ష జరగనున్నట్లు సమాచారం.

ప్రతి స్థానానికి తీవ్ర పోటీ ఉండటంతో ఆటగాళ్లు తమ శరీరంపై అధిక ఒత్తిడి పెంచుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో సపోర్ట్ స్టాఫ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని.. పూర్తిగా కోలుకోని ఆటగాళ్లను మళ్లీ మైదానంలోకి పంపకూడదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే ఆడే సమయానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడా?.. హర్షిత్ రాణాను కూడా తొందరపెట్టారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ అనంతరం ఫిజియో బృందంపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

నితిన్ పటేల్ స్థానంలో 2022లో కమ్లేశ్‌ చీఫ్ ఫిజియోగా బాధ్యతలు చేపట్టాడు. అయితే గత కొద్ది నెలలుగా భారత ఆటగాళ్లు ఎక్కువగా గాయాల పాలు కావడం పెద్ద చర్చకు దారితీసింది. దాంతో అతడి పని తీరుపై బీసీసీఐ ఓ కన్నేసింది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ పనితీరు పైనా అనుమానాలు వస్తున్నాయి. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ ముందు బుమ్రా ఫిట్‌నెస్ టెస్టులో పాసైనట్లు తొలుత సీవోఈ ప్రకటన చేసింది. ఒక్క రోజు వ్యవధిలోనే అతడి గాయం ఇంకా మానలేదని, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఆడటం లేదని ఈరోజు వెల్లడించింది. దాంతో సీవోఈలో మేనేజ్‌మెంట్ సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story