China Open Badminton: పోరాడి ఓడిన పీవీ సింధు.. ప్రిక్వార్టర్స్లోనే పయనం ముగింపు!
China Open Badminton: చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది.
China Open Badminton: పోరాడి ఓడిన పీవీ సింధు.. ప్రిక్వార్టర్స్లోనే పయనం ముగింపు!
China Open Badminton: చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సింధు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఓటమి తప్పలేదు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చైనా క్రీడాకారిణి, మాజీ ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫీయ్ 16-21, 22-20, 21-18 తేడాతో సింధుపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.
దాదాపు గంటన్నర (90 నిమిషాలు) పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి నుంచీ ఇద్దరు క్రీడాకారిణులు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. మొదటి గేమ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సింధు 21-16 తేడాతో గేమ్ను కైవసం చేసుకుని శుభారంభం చేసింది. అయితే రెండో గేమ్లోనూ సింధు అదే దూకుడును కొనసాగించినప్పటికీ, ఆఖరి క్షణాల్లో చెన్ యుఫీయ్ పుంజుకుంది. పట్టువదలకుండా పోరాడి 22-20 తేడాతో రెండో గేమ్ను గెలుచుకుని స్కోరును 1-1తో సమం చేసింది.
విజేత ఎవరో తేల్చే నిర్ణయాత్మక మూడో గేమ్లో ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. మ్యాచ్ చివరి నిమిషం వరకు రసవత్తరంగా సాగినప్పటికీ, కీలక సమయంలో చైనా షట్లర్ యుఫీయ్ పైచేయి సాధించి 21-18 తేడాతో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది.
ఇటీవలే ముగిసిన జపాన్ ఓపెన్ సెమీఫైనల్స్లో చెన్ యుఫీయ్ను ఓడించి ఫైనల్కు చేరిన సింధు, ఈసారి మాత్రం ఆమె చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.




