IPL-Australia: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. 'క్రికెట్ ఆస్ట్రేలియా' సంచలన ప్రతిపాదన!
IPL-Australia: CA invited BCCI to host an IPL match in Australia. ఆస్ట్రేలియా గడ్డపై త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
IPL-Australia: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. 'క్రికెట్ ఆస్ట్రేలియా' సంచలన ప్రతిపాదన!
IPL-Australia: ఆస్ట్రేలియా గడ్డపై త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంగీకరిస్తే.. ఆస్ట్రేలియాలో ఒక ఐపీఎల్ మ్యాచ్ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐకి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బహిరంగ ఆహ్వానం పంపినట్లు ఆసీస్ దినపత్రిక ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన అంతర్గత చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా ఒక కీలక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) రాబోయే సీజన్ ప్రారంభ మ్యాచ్ ఇండియాలో జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా బీబీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ పెర్త్ స్కార్చర్స్ జట్లు తలపడనున్నాయి. ఒక విదేశీ లీగ్కు సంబంధించిన అధికారిక మ్యాచ్ భారతదేశంలో జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రతి ఏటా ఒక మ్యాచ్ నిర్వహిస్తూ.. దీనిని ఆనవాయితీగా కొనసాగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. అందుకు బదులుగా ఓ ఐపీఎల్ మ్యాచ్ను తమ దేశంలో నిర్వహించాలని ఆస్ట్రేలియా కోరుతోంది.
భారతదేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించనున్న 'జీ డే నమస్తే' ఉత్సవాల్లో భాగంగా ఈ బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ప్రకటన అత్యంత కీలకమైనదిగా నిలిచింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఇరు దేశాల ప్రధాన మంత్రులు 'భారత్-ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్మ్యాప్' (India-Australia Sports Collaboration Roadmap)ను ఆవిష్కరించారు. ఈ ఒప్పందం ద్వారా స్పోర్ట్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైన్స్, అత్యాధునిక టెక్నాలజీ సహా క్రీడా రంగంలో పెట్టుబడులను విస్తరించనున్నారు. ఈ కార్యక్రమంలో విక్టోరియా ప్రీమియర్ జసింతా అల్లన్, ఆస్ట్రేలియా మాజీ మెన్స్ కెప్టెన్ స్టీవ్ వా, మాజీ మహిళా కెప్టెన్ లీసా స్థాలేకర్ తదితరులు పాల్గొన్నారు. ఇరు దేశాల యువ అథ్లెట్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ‘భారత్-ఆస్ట్రేలియా యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్’ను కూడా నిర్వహించనున్నారు.
'ప్రజలను ఏకం చేసే అత్యంత శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. ఈ రోడ్మ్యాప్ భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న క్రీడా బంధాన్ని మరిన్ని రంగాలకు విస్తరిస్తుంది. రాబోయే దశాబ్దం అంతర్జాతీయ క్రీడల్లో ఇరు దేశాలకు ఎంతో కీలకం. భారత్ 2030లో కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇస్తోంది. ఆస్ట్రేలియా 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్కు సిద్ధమవుతోంది' అని భారత ప్రధాని మోడీ అన్నారు. ఐపీఎల్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో నిర్వహించే అంశంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.




