BCCI Umpires: ఆటగాళ్లకు కాదు, అంపైర్లకే జరిమానా విధించాలి.. అప్పుడే అంతా సెట్!

BCCI Umpires: ముంబై-బెంగళూరు మ్యాచ్‌కు హాజరైన మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్.. స్లో ఓవర్‌రేట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్లో ఓవర్‌రేట్‌పై ఆటగాళ్లకు కాదు, అంపైర్లకే జరిమానా విధించాలని బీసీసీఐకి సూచించారు.

Rishvik
Published on: 15 April 2026 9:08 PM IST
BCCI Umpires
X

BCCI Umpires: ఆటగాళ్లకు కాదు, అంపైర్లకే జరిమానా విధించాలి.. అప్పుడే అంతా సెట్!

BCCI Umpires: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో మ్యాచ్‌ల నిడివి పెరగడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాత్రి ఆలస్యంగా మ్యాచ్‌లు ముగియడం వల్ల అభిమానులు, కామెంటేటర్లతో పాటు ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్,

దాదాపు 4 గంటల 22 నిమిషాల పాటు సాగడంతో నెట్టింట మరింత చర్చకు దారి తీసింది. ముంబై-బెంగళూరు మ్యాచ్‌కు హాజరైన మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్.. స్లో ఓవర్‌రేట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్లో ఓవర్‌రేట్‌పై ఆటగాళ్లకు కాదు, అంపైర్లకే జరిమానా విధించాలని బీసీసీఐకి సూచించారు.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రేజర్ స్టీవార్ట్ మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు నెమ్మదిగా సాగడానికి ప్రధాన కారణం అంపైర్ల నిర్లక్ష్యమేనని అభిప్రాయపడ్డాడు. ఆటను వేగంగా కొనసాగించడం అంపైర్ల బాధ్యత అని, కానీ వారు కఠినంగా వ్యవహరించడం లేదని తెలిపాడు. 'అంపైర్ల కారణంగానే ఐపీఎల్ మ్యాచ్‌లు ఆలస్యం అవుతున్నాయి. మ్యాచ్‌లను త్వరగా పూర్తి చేయించడం అంపైర్ల బాధ్యత.

మ్యాచ్‌ను వీక్షిస్తోన్న కోట్లాది మందికి ప్రతి బ్రేక్‌ ఓ ప్రచార అవకాశంగా మారింది. టైమ్‌ ఔట్లు, తరచూ జరిగే ఫీల్డింగ్ మార్పులు, ఆటలో తక్షణ నిర్ణయాల లోపం వంటి అంశాలు మ్యాచ్ వేగాన్ని తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా అంపైర్లు ఓవర్‌రేట్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో వెనుకడుగు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం వార్నింగ్స్, ఐదు పరుగుల పెనాల్టీలు విధించే అవకాశం ఉంది. కానీ వాటిని అమలు చేయడంలో అంపైర్లు ఆసక్తి చూపడం లేదు' అని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'ఈ నేపథ్యంలో బీసీసీఐకి నేను ఓ సూచన ఇద్దామనుకుంటున్నా. ఓవర్‌రేట్ సరిగ్గా పాటించకపోతే ఆటగాళ్లకు కాకుండా అంపైర్లకే జరిమానాలు విధించాలి. స్లో ఓవర్‌ రేట్‌ ఎదురైన ప్రతిసారీ అంపైర్లకే జరిమానాలు విధించాలి. అప్పుడే మ్యాచ్‌ల వేగం పెరుగుతుంది. మ్యాచ్‌లలో తరచూ ఆటంకాలు ఉంటే చూడాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది. ది హండ్రెడ్‌ లీగ్‌లో వికెట్‌ పడ్డాక 60 సెకన్ల క్లాక్‌ స్టార్ట్ అవుతుంది.

బ్యాటర్ రెడీగా లేకపోతే ఐదు పరుగుల పెనాల్టీ ఎదుర్కోవాల్సిందే. అయితే భారతదేశ పరిస్థితులు వేరు. ఇక్కడ వేడి వాతావరణం కారణంగా ఆటగాళ్లకు విరామాలు అవసరం. డ్రింక్స్ తీసుకెళ్లే వారిలో తొందర కనిపించడం లేదు. అంపైర్లూ పట్టించుకోవడం లేదు. మ్యాచ్‌లో అనవసరంగా ఎక్కువ విరామాలు ఉండటం సరైన పద్ధతి కాదు. అంపైర్లు కఠినంగా వ్యవహరిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది' అని ఫ్రేజర్ స్టీవార్ట్ స్పష్టం చేశాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story