Gautam Gambhir: బ్లూ ప్రింట్, ఆటగాళ్ల ఎంపిక అంటూ.. 2027 వన్డే వరల్డ్ కప్పై గంభీర్ కీలక వ్యాఖ్యలు!
Gautam Gambhir: వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీకి సంబంధించిన ప్రణాళికలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగిసిన తర్వాత ప్రారంభిస్తామని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. అప్పుడే బ్లూ ప్రింట్ సిద్ధం అవుతుందన్నాడు.
Gautam Gambhir: బ్లూ ప్రింట్, ఆటగాళ్ల ఎంపిక అంటూ.. 2027 వన్డే వరల్డ్ కప్పై గంభీర్ కీలక వ్యాఖ్యలు!
Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసింది. భారత జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టీమిండియా దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీకి సంబంధించిన ప్రణాళికలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగిసిన తర్వాత ప్రారంభిస్తామని తెలిపాడు. అప్పుడే బ్లూ ప్రింట్ సిద్ధం అవుతుందన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ ఎక్కువగా ఆడటం లేదని, అందుకే ముందుగానే సరైన ప్రణాళిక అవసరమని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
'ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ 2027 కోసం భారత్ సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ 2026 నుంచి వరల్డ్ కప్ 2027 వరకు భారత్ దాదాపు 25 నుంచి 30 వన్డే మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లు జట్టు కాంబినేషన్ను పరీక్షించడానికి, సరైన ఆటగాళ్లను గుర్తించడానికి ఎంతో కీలకం అవుతాయి. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకునే వన్డే సిరీస్లలో జట్టు ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో ఎక్కువగా మ్యాచ్లు జరగడం లేదు. వీలైనంత త్వరగా సన్నాహకాలు ప్రారంభిస్తే మంచిది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పరిస్థితులకు సరిపోయే ఆటగాళ్లను ఎంపిక చేయడం ప్రధాన లక్ష్యం' అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.
'దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో క్రికెట్ ఆడటం అంత సులభం కాదు. అక్కడి పిచ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జట్టును సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సరైన కాంబినేషన్లు రూపొందించడం, ఆ పరిస్థితులకు తగిన ఆటగాళ్లను ఎంపిక చేయడం కీలకం. ఈ ప్రక్రియలో సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది కలిసి పనిచేస్తారు. ఐపీఎల్ 2026 ముగిసే సమయానికి టీమిండియాకు 2027 వన్డే వరల్డ్ కప్ కోసం స్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధంగా ఉంటుంది' అని కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. గౌతీ కోచ్ అయ్యాక భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 వన్డే వరల్డ్ కప్ టైటిళ్లను భారత్ ఖాతాలో వేసుకుంది. దాంతో గంభీర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. చూడాలి మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో.




