Complaint on Hardik Pandya: భారత జెండాను అవమానించారు.. హార్దిక్ పాండ్యాపై కేసు

Complaint on Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించారని హార్దిక్ పాండ్యాపై బెంగళూరులో ఫిర్యాదు నమోదైంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో

KVD Varma
Published on: 12 March 2026 10:54 AM IST
Complaint on Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించారని హార్దిక్ పాండ్యాపై బెంగళూరులో ఫిర్యాదు
X

Complaint on Hardik Pandya

Complaint on Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ లో విజయం సాధించిన ఆనందంలో హార్దిక్ పాండ్య చేసిన ఒక పని ఇప్పుడు అతనికి చిక్కులు తెచ్చిపెడుతోంది. పూణేకు చెందిన న్యాయవాది వాజేద్ ఖాన్ బిద్కర్ బెంగళూరులోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో భారత జెండాను అవమానించారనే ఆరోపణలతో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు చేశారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాండ్యా జాతీయ జెండాను గౌరవించలేదని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.

వాజేద్ ఖాన్ కంప్లైంట్ ప్రకారం.. వరల్డ్ కప్ లో విజయం తర్వాత టీం ఇండియా గ్రౌండ్ లో వేడుకలు జరుపుకుంటున్న చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో, పాండ్యా భారత జెండాను భుజాలపై వేసుకుని మైదానంలో నృత్యం చేస్తూ, పరిగెడుతూ కనిపించాడు. వేడుకల సమయంలో, పాండ్యా తన స్నేహితురాలితో వేదికపై పడుకుని, త్రివర్ణ పతాకాన్ని భుజాలపై మోస్తున్నట్లు కనిపించిన ఒక వీడియో, ఫోటో కూడా కనిపించాయి. ఇది జాతీయ జెండా గౌరవానికి విరుద్ధమని అంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

జాతీయ జెండా చట్టాన్ని ఉటంకిస్తూ..

న్యాయవాది వాజెద్ ఖాన్, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడాలని ఆదేశించిందని పేర్కొన్నారు. వేడుకల సమయంలో హార్దిక్ పాండ్యా దీనిని పాటించలేదని, దీనిని జాతీయ జెండాకు అవమానంగా పరిగణించవచ్చని ఆయన ఆరోపించారు. ఈ చట్టంలోని సెక్షన్ 2 కింద ఆయన ఫిర్యాదు చేశారు.

జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అపవిత్రం చేయడాన్ని నిరోధించడానికి ఈ చట్టం రూపొందించారు. ఈ చట్టం ప్రకారం త్రివర్ణ పతాకాన్ని నేలపై పడవేయడం, దానిని సరిగ్గా ధరించకపోవడం లేదా దాని గౌరవాన్ని దిగజార్చడం వంటి చర్యలు శిక్షార్హమైనవి.

హార్దిక్ పాండ్య జెండాను అవమానించినట్టు శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని వాజెద్ ఖాన్ తెలిపారు. మొదట్లో ఈ సంఘటన అహ్మదాబాద్‌లో జరిగిందని, కాబట్టి కేసు అక్కడే నమోదు చేయాలని పోలీసులు తెలిపారు. అయితే, త్రివర్ణ పతాకం మొత్తం దేశానికి జాతీయ చిహ్నం కాబట్టి ఎక్కడైనా కంప్లైంట్ చేయవచ్చని ఖాన్ వాదించారు. ఈవాదనతో ఏకీభవించిన పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించి, సంబంధిత కాపీని ఆయనకు ఇచ్చారు.

న్యూజిలాండ్‌ను ఓడించి..

ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇది భారత్‌కు మూడో టీ20 ప్రపంచ కప్ టైటిల్ కావడం విశేషం. భారతదేశం గతంలో 2007 మరియు 2024లో ఈ ట్రోఫీని గెలుచుకుంది. అంతేకాకుండా, ఒక జట్టు తమ స్వదేశంలో జరిగిన టోర్నీలో T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అలాగే, టీమిండియా వరుసగా రెండుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది.

KVD Varma

KVD Varma

Next Story