IND vs ENG: టీమిండియాను ఆందోళనకు గురిచేస్తున్న హార్దిక్‌.. మరి కింగ్ కోహ్లీ పరిస్థితి ఏంటి?

IND vs ENG: Hardik Pandya Injury Concern Grows. హార్దిక్ పాండ్య గాయాల సమస్యలు మళ్లీ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Rishvik
Published on: 20 Jun 2026 8:02 PM IST
IND vs ENG
X

IND vs ENG: టీమిండియాను ఆందోళనకు గురిచేస్తున్న హార్దిక్‌.. మరి కింగ్ కోహ్లీ పరిస్థితి ఏంటి?

IND vs ENG: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయాల సమస్యలు మళ్లీ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన హార్దిక్.. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కూ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ, జట్టు యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ.. మరో గాయం అతని పునరాగమనానికి అడ్డుగా మారిందని తెలుస్తోంది.

ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సమయంలో హార్దిక్ పాండ్య వెన్నునొప్పి (బ్యాక్ స్పాసమ్) సమస్యతో బాధపడ్డాడు. ఆ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు వెళ్లాడు. అయితే అక్కడ పునరావాస ప్రక్రియలో ఉండగానే అతనికి క్వాడ్రిసెప్స్ కండరాల గాయం తలెత్తింది. ఈ గాయం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా హార్దిక్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అయితే హార్దిక్ పాండ్య గాయాలు భారత జట్టుకు కొత్తేమి కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు చీలమండ గాయానికి గురవడంతో జట్టు సమతుల్యత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్‌ను 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎక్కువగా ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నప్పటికీ.. అతని ఫిట్‌నెస్ సమస్యలు ఆ ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టుకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాడు. ఇటీవల కాలంలో అతడికి వరుస అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు.. భవిష్యత్తులో కీలక ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 2027 ప్రపంచకప్ దిశగా జట్టు నిర్మాణంలో నితీశ్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ.. అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న కోహ్లీ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం లభించింది. తాజా సమాచారం ప్రకారం.. కోహ్లీ జూన్ 22న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు.

ఆ పరీక్ష ఫలితాల ఆధారంగానే వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది తేలనుంది. దీంతో ప్రస్తుతం భారత అభిమానుల దృష్టి మొత్తం కోహ్లీ ఫిట్‌నెస్ అప్‌డేట్‌పైనే నిలిచింది. హార్దిక్ గాయంతో టీమిండియా ఆందోళన చెందుతుండగా.. కోహ్లీ ఫిట్‌నెస్ పరీక్ష ఫలితం ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు భారత జట్టుకు కీలకంగా మారింది. వచ్చే కొన్ని రోజుల్లో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పరిస్థితిపై స్పష్టత రానుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story