IND vs ENG 3rd ODI: లార్డ్స్లో సిరీస్ డిసైడర్ మ్యాచ్.. టీమిండియాను భయపెడుతున్న గణాంకాలు!
India's Poor Record at Lord's vs England 3rd ODI. ఆదివారం లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో సిరీస్ డిసైడర్ మ్యాచ్.. టీమిండియాను భయపెడుతున్న గణాంకాలు!
IND vs ENG 3rd ODI: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం (జులై 19) లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే మూడో మ్యాచ్తో ఇంగ్లీష్ గడ్డపై భారత్ పర్యటన ముగియనుంది. టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 4-0తో గెలుచుకుంది. ఇక సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.
తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుంది. దీంతో లార్డ్స్ వేదికగా జరిగే చివరి వన్డే సిరీస్ విజేతను నిర్ణయించనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం భారత్కు లార్డ్స్లో ఉన్న వన్డే రికార్డుపైనే నిలిచింది.
క్రికెట్కు మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానం భారత జట్టుకు వన్డేల్లో పెద్దగా కలిసిరాలేదు. లార్డ్స్లో ఇప్పటివరకు టీమిండియా మొత్తం 9 వన్డే మ్యాచ్లు ఆడింది. ఈ చారిత్రాత్మక వేదికపై భారత్కు ఆశించిన స్థాయిలో విజయాలు లేవు. ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే అందుకుంది. ఐదు మ్యాచ్ల్లో ఓటమి చవిచూచూడగా.. మరో మ్యాచ్ టైగా ముగిసింది.
ఈ గణాంకాలు చూస్తే.. లార్డ్స్లో భారత్కు అంత గొప్ప రికార్డు లేదని స్పష్టమవుతోంది. లార్డ్స్లో సిరీస్ డిసైడర్ మ్యాచ్ ముందు.. ఈ గణాంకాలు టీమిండియాను భయపెడుతున్నాయి. అయినప్పటికీ సిరీస్ డిసైడర్లో ఆ రికార్డును మార్చాలని శుభ్మన్ గిల్ సేన పట్టుదలగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
భారత కాలమానం ప్రకారం.. మధ్యాహం 3.30కి భారత్, ఇంగ్లండ్ మూడో వన్డే మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఇరు జట్ల కెప్టెన్స్ టాస్ మధ్యాహం 3 గంటలకు వేయనున్నారు. మూడో వన్డేను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అలానే జియో హాట్స్టార్లో ఉచితంగా వీక్షించవచ్చు. లార్డ్స్ పిచ్ బౌలింగ్కు అనుకూలం. ముఖ్యంగా పేసర్లకు బాగా సహకరిస్తుంది. ఇక్కడ కొత్త బంతితో స్వింగ్, బౌన్స్ లభిస్తాయి. ఈ పిచ్పై స్పిన్నర్ల పాత్ర పరిమితం అనే చెప్పాలి. రెండో ఇన్నింగ్స్లో పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి.
రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైన తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ భారత జట్టు బ్యాటింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి 25 ఓవర్ల వరకు 300కు పైగా స్కోర్ చేసే స్థితిలో ఉన్నామని.. కానీ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడం వల్ల భారీ స్కోర్ చేయలేకపోయామని చెప్పాడు. ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్ నుంచి మరింత మెరుగైన సహకారం ఆశించామని, అయితే అది దక్కలేదని గిల్ పేర్కొన్నాడు.
కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ (66) అర్ధ శతకాలతో రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ 233 పరుగులకే ఆలౌటైంది. అనంతరం జో రూట్ అజేయంగా 99 పరుగులతో ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఇప్పుడు సిరీస్ను కైవసం చేసుకోవాలంటే లార్డ్స్లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. చారిత్రాత్మక వేదికపై గత రికార్డులను మరచి సిరీస్ను గెలిచి ఇంగ్లండ్ పర్యటనను విజయవంతంగా ముగించాలని టీమిండియా చూస్తోంది.




