IND vs ENG 4th T20I : ఇంగ్లాండ్ చేతిలో టీమిండియాకు ఘోర పరాభవం.. 12 ఏళ్ల తర్వాత టీ20 సిరీస్ కోల్పోయిన భారత్

IND vs ENG 4th T20I : ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియాకు ఘోర పరాభవం ఎదురైంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

CR Reddy
Published on: 10 July 2026 5:53 AM IST
IND vs ENG 4th T20I
X

 IND vs ENG 4th T20I

IND vs ENG 4th T20I : భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ పర్యటన ఒక పీడకలలా మారిపోయింది. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 3-0తో ఆధిక్యాన్ని సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ చేతిలో ఒక టీ20 సిరీస్‌లో ఓడిపోవడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుస ఓటములతో సతమతమవుతున్న శ్రేయస్ అయ్యర్ సేనకు ఈ ఓటమి కోలుకోలేని దెబ్బ తీసింది.

ఈ కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమవడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నాడు. ఆయన కేవలం 49 బంతుల్లోనే 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయ్యర్ ఆడిన ఈ ఒంటరి పోరాటం వల్ల టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కానీ మిగతా బ్యాటర్లలో ఎవరూ కూడా కనీసం 30 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. శివమ్ దూబే 22 పరుగులు చేయగా, ఓపెనర్లు అభిషేక్ శర్మ 16, వైభవ్ సూర్యవంశీ 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ చెరో 2 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశారు.

కనీసం బౌలింగ్‌లోనైనా పోరాడుతుందనుకున్న భారత జట్టుకు ఇంగ్లాండ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. 159 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఓపెనర్ జోస్ బట్లర్ (8) త్వరగానే అవుట్ అయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్, మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కలిసి మైదానంలో పరుగుల వరద పారించారు. హ్యారీ బ్రూక్ కేవలం 33 బంతుల్లోనే 72 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా, ఫిల్ సాల్ట్ 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి ధాటికి ఇంగ్లాండ్ జట్టు కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఊదేశింది. భారత బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story