IND vs SL: శ్రీలంకకు కోలుకోలేని దెబ్బ.. రెండో టెస్టు కూడా గెలవడం కష్టమే.. కారణమిదే ?
IND vs SL: భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ ఓటమితో కుదేలైన శ్రీలంకకు ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త తగిలింది.
IND vs SL
IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ చేతిలో 165 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న శ్రీలంకకు ఆ తర్వాతి రోజే కోలుకోలేని షాక్ తగిలింది. ఆగస్టు 23 నుంచి జరగబోయే ఆఖరి టెస్టుకు జట్టులోని కీలక ప్లేయర్లు అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటికే గాయాలతో ఇబ్బంది పడుతున్న కుసల్ మెండిస్, పథుమ్ నిస్సాంక బాటలోనే సీనియర్ బ్యాటర్ దినేష్ చండీమాల్ కూడా రెండో టెస్టు నుంచి తప్పుకున్నట్లు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ అధికారికంగా ప్రకటించారు.
దినేష్ చండీమాల్ దూరం
తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో దినేష్ చండీమాల్ తల, మెడ భాగానికి తీవ్ర గాయమైంది. గ్రౌండ్లోనే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడి స్థానంలో పాసిందూ సూర్యబండారను కన్కషన్ సబ్స్టిట్యూట్గా మైదానంలోకి దించారు. ఇదే క్రమంలో పాసిందూ టెస్టు అరంగేట్రం కూడా జరిగింది. గాయం తీవ్రత తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు చండీమాల్ను రెండో టెస్టు నుంచి తప్పించారు. అతడితో పాటు తొడకండరాల గాయంతో బాధపడుతున్న కుసల్ మెండిస్, మణికట్టు గాయంతో ఉన్న ఓపెనర్ పథుమ్ నిస్సాంక ఈ మ్యాచ్కు పూర్తిగా దూరమయ్యారు.
యువ ఆటగాళ్లకు ఇదొక పరీక్ష
గాయాలపై హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ స్పందిస్తూ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. "కుసల్ మెండిస్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు, అతడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. చండీమాల్ కూడా తదుపరి టెస్టుకు అందుబాటులో లేడు. సీనియర్ ఆటగాళ్లను మిస్ అవ్వడం జట్టుకు పెద్ద లోటే అయినప్పటికీ, ఇది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి లభించిన అద్భుతమైన అవకాశం" అని కిర్స్టన్ పేర్కొన్నారు.
తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం
మొదటి టెస్టులో భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత శతకంతో మెరిశాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌట్ కాగా, భారత బౌలర్ మానవ్ సుతార్ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. 178 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. లంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 206 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 165 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది.




