భారత్ ఫ్యాన్స్కు క్రికెట్ పండగ.. ఒకే రోజు మూడు మ్యాచ్లు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్!
Indian cricket: భారత క్రికెట్ చరిత్రలో బుధవారం (జూన్ 17) ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఆ రోజు టీమిండియా అభిమానులకు నాన్స్టాప్ క్రికెట్ వినోదం అందనుంది.
భారత్ ఫ్యాన్స్కు క్రికెట్ పండగ.. ఒకే రోజు మూడు మ్యాచ్లు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్!
Indian cricket: భారత క్రికెట్ చరిత్రలో బుధవారం (జూన్ 17) ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఆ రోజు టీమిండియా అభిమానులకు నాన్స్టాప్ క్రికెట్ వినోదం అందనుంది. భారత సీనియర్ పురుషుల జట్టు, భారత మహిళల జట్టుతో పాటు ఇండియా-ఎ టీమ్ ఒకే రోజు వేర్వేరు మ్యాచ్లు ఆడనుంది. దాంతో భారత్ క్రికెట్ ఫ్యాన్స్కు దాదాపు 12 గంటల పాటు టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా మూడు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ఉదయం 10 గంటలకు ఇండియా-ఎ వర్సెస్ అఫ్గానిస్థాన్-ఎ:
క్రికెట్ సందడి ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుంది. ట్రై సిరీస్లో భాగంగా ఇండియా-ఎ టీమ్.. అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్కు హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మ నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లతో జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్కు చేరుకోవాలంటే.. భారత్కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అందుకే యువ భారత జట్టు విజయంపై దృష్టి సారించింది.
మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్:
మధ్యాహ్నం 1:30 గంటలకు భారత సీనియర్ జట్టు అఫ్గానిస్థాన్తో వన్డే మ్యాచ్ ఆడనుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్లో ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్లు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
రాత్రి 7 గంటలకు మహిళల టీ20 ప్రపంచకప్ పోరు:
అసలైన మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడనుంది. పాకిస్థాన్పై ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సెమీఫైనల్ అవకాశాలను మరింత బలపర్చుకోవాలని చూస్తోంది. అలాగే తదుపరి కీలకమైన దక్షిణాఫ్రికా మ్యాచ్కు విజయోత్సాహంతో వెళ్లాలనే లక్ష్యంతో ఉంది.
అభిమానులకు పండగే:
మొత్తం మీద జూన్ 17 భారత క్రికెట్ అభిమానులకు అసలైన క్రికెట్ పండగ రోజుగా మారనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు వరుసగా మూడు భారత జట్ల మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు పూర్తి స్థాయి వినోదం లభించనుంది. ఇండియా-ఎ, సీనియర్ జట్టు, మహిళల జట్టు.. ఇలా మూడు జట్ల ప్రదర్శనను ఒకే రోజు ఆస్వాదించే అరుదైన అవకాశం అభిమానులకు దక్కనుంది. టీమిండియా ఫ్యాన్స్కు ఇది మరపురాని క్రికెట్ దినంగా నిలవనుంది.




