IND vs ENG 3rd ODI: జస్‌ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. బీసీసీఐ షాకింగ్ అప్‌డేట్!

IND vs ENG 3rd ODI: Jasprit Bumrah misses the IND vs ENG 3rd ODI at Lord's. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మూడో వన్డేకు దూరమయ్యాడు.

Rishvik
Published on: 19 July 2026 5:42 PM IST
IND vs ENG 3rd ODI
X

IND vs ENG 3rd ODI: జస్‌ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. బీసీసీఐ షాకింగ్ అప్‌డేట్!

IND vs ENG 3rd ODI: భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే ఆరంభమైంది. ఈ కీలక వన్డేకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ వన్డేకు దూరమయ్యాడు. టాస్ సందర్భంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. బుమ్రా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని వెల్లడించాడు. అనంతరం బీసీసీఐ కూడా అతడి గాయంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

'కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలికి గాయం అయింది. ఆ గాయం కారణంగా మోకాలిలో వాపు ఏర్పడటంతో అతడిని మూడో వన్డేకు ఎంపిక చేయలేదు' అని బీసీసీఐ స్పష్టం చేసింది. సిరీస్ డిసైడర్‌కు ముందు బుమ్రా దూరమవడం టీమిండియాకు పెద్ద లోటు. ఇప్పటికే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ నుంచి తప్పుకోగా.. ఇప్పుడు బుమ్రా కూడా గాయపడటంతో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం దక్కింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులో చోటు సంపాదించాడు. అనారోగ్యం కారణంగా రెండో వన్డేకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు విశ్రాంతిని ఇచ్చారు.

మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లార్డ్స్ పిచ్‌పై మంచి స్కోరు సాధించి భారత్‌పై ఒత్తిడి తీసుకురావడమే తమ టార్గెట్ తెలిపాడు. రెండో వన్డేలో మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లను కట్టడి చేయడం, జో రూట్ అద్భుత ఇన్నింగ్స్ తమ విజయానికి కీలకమైందని గుర్తు చేశాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. కార్డిఫ్‌లో భారత్ మంచి స్థితిలో ఉన్నప్పటికీ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడం ఓటమికి కారణమైందని అన్నాడు. లార్డ్స్ పిచ్‌పై స్పిన్నర్ల కంటే పేసర్లకే ఎక్కువ సహకారం ఉంటుందని భావించి నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగినట్లు వివరించాడు. సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ట్రోఫీని కైవసం చేసుకోనుంది. అయితే బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్ లేకపోవడం టీమిండియాకు పెద్ద సవాలుగా మారింది.

మూడో వన్డేలో ఇంగ్లండ్ అదరగొడుతోంది. 25 ఓవర్లకు ఒక వికెట్ కూడా కోల్పోకుండా 163 రన్స్ చేసింది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లు జాకబ్ బెతెల్, బెన్ డకెట్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. డకెట్, బెతెల్‌ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు ప్రయత్నిస్తున్నా.. వారు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. బెన్ డకెట్ 64 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. మరోవైపు బెతెల్ 51 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

తుది జట్లు: టీమ్‌ఇండియా ప్లేయింగ్‌ 11: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ. ఇంగ్లండ్ ప్లేయింగ్‌ 11: బెన్ డకెట్, జాకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జోష్ టంగ్.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story