Manoj Tiwary: ముంబై సామ్రాజ్యం కూలిపోతుంటే రోహిత్ తట్టుకోలేకపోతున్నాడు.. హార్దిక్ ఇక చాలు!

Manoj Tiwary says Rohit Sharma is hurt. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ గత మూడు సీజన్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Rishvik
Published on: 21 May 2026 6:37 PM IST
Manoj Tiwary
X

Manoj Tiwary: ముంబై సామ్రాజ్యం కూలిపోతుంటే రోహిత్ తట్టుకోలేకపోతున్నాడు.. హార్దిక్ ఇక చాలు!

Manoj Tiwary: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ గత మూడు సీజన్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐపీఎల్ 2024లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ముగించిన ముంబై.. ఐపీఎల్ 2026లో కూడా ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయి మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు తర్వాత జట్టులోని వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇదే విషయంపై మాజీ భారత క్రికెటర్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో.. మళ్లీ రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి మాట్లాడుతూ.. 'తాను నిర్మించిన ముంబై ఇండియన్స్ సామ్రాజ్యం కళ్లముందే కూలిపోతుంటే రోహిత్ శర్మ ఏమీ చేయలేక చూస్తున్నాడు. డగౌట్‌లో అతని ముఖ భావాలు చూస్తేనే ఆ బాధ స్పష్టంగా అర్థమవుతోంది. అతను కెప్టెన్‌గా ఉంటే కొన్ని నిర్ణయాలు ఉండేవి కావు' అని అన్నాడు. వచ్చే సీజన్‌లో ముంబైకి కొత్త కెప్టెన్ ఉండటం ఖాయమని తివారీ అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ లేదా జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. అయితే తన మనసులో మాత్రం రోహిత్ శర్మనే మళ్లీ కెప్టెన్‌గా చూడాలని ఉందని వెల్లడించాడు.

'జస్ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలర్ కావడంతో గాయాల సమస్య ఎక్కువగా ఉండొచ్చు. అందుకే సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయం కావచ్చు. కానీ రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్ చేస్తే అతనికి గౌరవం తిరిగి ఇచ్చినట్టవుతుంది. అతను మళ్లీ మంచి జట్టును నిర్మించగలడు' అని మనోజ్ తివారి ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై మరో మాజీ భారత క్రికెటర్ మురళీ కార్తీక్ కూడా స్పందించాడు. రోహిత్, సూర్యకుమార్, బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ.. బయట నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చి కెప్టెన్ చేయడం జట్టు వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు.

'ముంబై జట్టులో ఇప్పటికే రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి సమయంలో బయట నుంచి ఒకరిని తీసుకొచ్చి కెప్టెన్ చేస్తే ఆటగాళ్లు షాక్ అవ్వడం సహజం. ఆ నిర్ణయం జట్టులోని సమతౌల్యాన్ని దెబ్బతీసింది' అని మురళీ కార్తిక్ చెప్పాడు. అభిమానుల్లో కూడా రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాబోయే సీజన్‌లో ముంబై మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story