Dhoni: ధోనీ ప్లీజ్ ఆడు.. లేకపోతే నేనే ప్రేక్షకుల మధ్యలోకి తీసుకొస్తా!
Dhoni: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ చివరి హోమ్ మ్యాచ్కు సిద్ధమైంది.
Dhoni: ధోనీ ప్లీజ్ ఆడు.. లేకపోతే నేనే ప్రేక్షకుల మధ్యలోకి తీసుకొస్తా!
Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ చివరి హోమ్ మ్యాచ్కు సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో సీఎస్కే కీలక పోరులో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్కు వీడ్కోలు చెప్పే దశలో ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చెపాక్లో ఈరోజు జరిగే మ్యాచ్ ధోనీకి చివరి హోమ్ మ్యాచ్ అవుతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో మాజీ భారత స్పిన్నర్, సీఎస్కే మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ తప్పకుండా ఈ మ్యాచ్లో ఆడాలని విజ్ఞప్తి చేశాడు. జియోహాట్స్టార్లో మాట్లాడిన హర్భజన్.. ‘ఎంఎస్ ధోనీ గతంలో తన చివరి మ్యాచ్ను చెన్నైలో ఆడుతానని చెప్పాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఈ సీజన్లో చెన్నైకి ఇది చివరి మ్యాచ్. కాబట్టి అభిమానులు ధోనీని చివరిసారి చెపాక్లో ఆడుతుండగా చూడొచ్చు’ అని అన్నాడు. అయితే ధోనీ ఈ మ్యాచ్లో ఆడుతాడా లేదా అన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గాయం కారణంగా ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
'ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా ఎంఎస్ ధోనీ ఆడకపోతే.. వచ్చే ఏడాది మళ్లీ వస్తాడేమో. తర్వాతి ఏడాది నా చివరి మ్యాచ్' అని చెప్పొచ్చు. ధోనీ విషయంలో ఏదైనా జరగొచ్చు. కానీ ఆయన ఈరోజు తప్పకుండా ఆడాలని కోరుకుంటున్నాను’ అని హర్భజన్ సింగ్ చెప్పాడు. భజ్జి సరదాగా మాట్లాడుతూ.. 'ధోనీ ప్లీజ్ ఆడు. లేదంటే నేను చెన్నైకి వచ్చి నిన్ను మైదానంలోకి లాగి తీసుకెళ్తాను’ అంటూ అభిమానులను అలరించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ధోనీ అభిమానులు కూడా చెపాక్లో తమ అభిమాన హీరోను మరోసారి మైదానంలో చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై గతంలో తానే చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ‘నా క్రికెట్ కెరీర్ను ఎప్పుడూ ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. నా చివరి వన్డే మ్యాచ్ రాంచీలో ఆడాను. అలాగే నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో ఆడాలని ఆశిస్తున్నాను. అది వచ్చే ఏడాదైనా కావొచ్చు.. ఐదేళ్ల తర్వాతైనా కావొచ్చు’ అని ధోనీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే ఇంకా పోటీలోనే ఉంది. మధ్యలో వరుస విజయాలతో మళ్లీ పుంజుకున్న చెన్నై.. నేటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై గెలిచి అవకాశాలను బలపరచుకోవాలని చూస్తోంది. చెపాక్లో అభిమానుల మద్దతుతో సీఎస్కే ఎలా ఆడుతుందో చూడాలి.




