MS Dhoni: ఎంఎస్ ధోనీకి కొత్త బాధ్యతలు.. ఇక కప్పు ఖాయమేనా?

MS Dhoni: MS Dhoni Set for New CSK Mentor Role. ఎంఎస్ ధోనీకి త్వరలోనే సీఎస్‌కే ఫ్రాంచైజీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Rishvik
Published on: 15 July 2026 6:32 PM IST
MS Dhoni
X

MS Dhoni: ఎంఎస్ ధోనీకి కొత్త బాధ్యతలు.. ఇక కప్పు ఖాయమేనా?

MS Dhoni: క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఫ్రాంచైజీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలగడంతో.. జట్టులో ధోనీకి కీలక బాధ్యతలు ఇవ్వాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి సీఎస్‌కే మెంటర్‌గా ధోనీ బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం. అంతేకాకుండా ఫ్లెమింగ్ స్థానంలో కొత్త హెడ్ కోచ్ ఎంపికలో కూడా మహీ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

2023లో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇటీవలి సీజన్లలో ఆశించిన ఫలితాలు రాలేదు. వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన సీఎస్‌కే.. ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉంది. గాయాల కారణంగా ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ జట్టు వ్యూహాలు, యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించాడు. 2027లో మెంటర్‌గా బాధ్యతలు చేపడతారన్నది స్పష్టత లేకపోయినా.. క్రికెట్‌కు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాల్లో ధోనీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సీఎస్‌కే యాజమాన్యం భావిస్తోందట.

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సీఎస్‌కేకు షాక్ తగిలింది. 17 సంవత్సరాల పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పరస్పర అంగీకారంతో, ఎన్నో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్‌కే వెల్లడించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్.. 2009లో హెడ్ కోచ్ బాధ్యతలు అందుకున్నాడు.

ఫ్లెమింగ్ కోచింగ్‌లో చెన్నై ఐదు ఐపీఎల్ టైటిల్స్, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. చెన్నై రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో పాటు 10 సార్లు ఫైనల్ ఆడింది. ఫ్లెమింగ్ తప్పుకోవడంతో సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్ ఎవరు అనే అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. హెడ్ కోచ్ బాధ్యతలు బాధ్యతలు ఎవరు చేపడతారో చూడాలి.

ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన తొలి వన్డే సందర్భంగా ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఎంఎస్ ధోనీ ప్రత్యక్షమవడం అభిమానులను ఉత్సాహపరిచింది. భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి మ్యాచ్‌ను వీక్షించిన ధోనీని స్టేడియంలో కెమెరాలు చూపించగానే ప్రేక్షకులు ఘనంగా చప్పట్లతో స్వాగతించారు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ధోనీకి అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మ్యాచ్ సందర్భంగా మాజీ భారత వికెట్‌కీపర్ దినేశ్ కార్తిక్‌తో ధోనీ ముచ్చటించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తూ కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ను వీక్షిస్తూ తన 45వ జన్మదినాన్ని జరుపుకున్న ధోనీ.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఆటను దగ్గరుండి వీక్షిస్తున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story