Mumbai Indians: బుమ్రా-హాజిల్‌వుడ్-భువీ కాంబో ఎలా ఉండేది!

Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సమయంలో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) చేసిన బిడ్డింగ్ స్ట్రాటజీ ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది.

Rishvik
Published on: 29 April 2026 6:33 PM IST
Mumbai Indians
X

Mumbai Indians: బుమ్రా-హాజిల్‌వుడ్-భువీ కాంబో ఎలా ఉండేది!

Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సమయంలో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) చేసిన బిడ్డింగ్ స్ట్రాటజీ ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్‌ల కోసం ముంబై గట్టిగా పోటీ పడింది. కానీ చివరికి ఈ ఇద్దరినీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకోవడంతో ముంబై గేమ్ ప్లాన్ కొద్దిలో మిస్సయ్యింది. ఇప్పుడు హాజిల్‌వుడ్-భువీ కాంబో ఆర్సీబీ తరఫున ఇరగదీస్తుంటే.. ముంబై వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది.

భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్ రూ.10.25 కోట్ల వరకు బిడ్ చేసింది. అయితే చివరి దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. జోష్ హాజిల్‌వుడ్ కోసం ముంబై రూ.12.25 కోట్ల వరకు వెళ్లింది. కానీ మరోసారి ఆర్సీబీ తగ్గేదేలే అన్నట్లు బిడ్ వేస్తూ వచ్చింది. ముంబై వెనక్కి తగ్గగా.. ఆర్సీబీ హాజిల్‌వుడ్‌ను రూ.12.50 కోట్లకు దక్కించుకుంది. ఈ రెండు బిడ్స్ ముంబై చేతులెత్తేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చాయి. ఈ ఇద్దరూ ముంబై సొంతమైతే.. ఆ జట్టు బౌలింగ్ లైనప్ ఎంత భయంకరంగా ఉండేదో ఊహించవచ్చు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ పేసర్ జట్టులో ఉన్నాడు. అతనికి తోడుగా హాజిల్‌వుడ్ ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, భువనేశ్వర్ స్వింగ్ బౌలింగ్ కలిస్తే ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా మారేది.

జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో తన యార్కర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. జోష్ హాజిల్‌వుడ్ పవర్‌ప్లేలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తాడు. ఇక భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో స్వింగ్‌ ద్వారా టాప్ ఆర్డర్‌ను కుదిపేయగలడు. ఈ ముగ్గురు కలిసి ఉంటే ఐపీఎల్‌లోనే అత్యంత ప్రమాదకరమైన పేస్ అటాక్‌గా ముంబై నిలిచేది అనడంలో సందేహం లేదు. బుమ్రా-హాజిల్‌వుడ్-భువీ కాంబో ముంబైకి ఉంటే.. ఐపీఎల్ 2026లో ఎదురులేకుండా పోయేది. ప్రస్తుతం ముంబై వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. లీగ్ దశలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయిన నేపథ్యంలో.. ముంబై ప్లే ఆఫ్స్ చేరడం దాదాపుగా అసాధ్యమే.

అయితే ఐపీఎల్ ఆక్షన్ అనేది ఎప్పుడూ అనుకున్నట్టుగా జరగదు. స్వల్ప బిడ్డింగ్ తేడాతో ముంబై జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి స్టార్ బౌలర్లను కోల్పోయింది. అయినప్పటికీ ఈ విషయం ఇప్పుడు అభిమానుల్లో ‘వాట్ ఇఫ్’ చర్చకు దారి తీసింది. ఒకవేళ ఈ ట్రియో నిజంగా కలిసి ఉంటే.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం మరింత భీకరంగా మారేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో జట్టు నిర్మాణం ఎంత కీలకమో ఈ ఉదాహరణ మరోసారి నిరూపిస్తోంది. ఒక్కో ఆక్షన్ నిర్ణయం జట్టు భవిష్యత్తును ఎలా మార్చగలదో ముంబైకి ఇప్పటికే బాగా అర్థం అయుంటుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story