CWG 2026 : మోకాలు దెబ్బతిన్నా తగ్గేదేలే.. కామన్వెల్త్ మెడల్ను దక్కించుకున్న కేరళ కుర్రాడు
CWG 2026 : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచాడు.
CWG 2026
CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ లాంగ్ జంప్ విభాగంలో భారత అథ్లెట్ మురళి శ్రీశంకర్ అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్లాస్గోలో జరిగిన పోటీల్లో పురుషుల లాంగ్ జంప్ విభాగంలో 8.09 మీటర్ల దూరం దూకి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. దీనితో కామన్వెల్త్ గేమ్స్ లాంగ్ జంప్ చరిత్రలోనే వరుసగా రెండు పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్గా శ్రీశంకర్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గతంలో 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లోనూ ఇతను వెండి పతకం సాధించిన సంగతి తెలిసిందే.
కేరళకు చెందిన 27 ఏళ్ల శ్రీశంకర్ సాధించిన ఈ పతకం అత్యంత ప్రత్యేకమైనది. ఏప్రిల్ 2024లో తీవ్రమైన మోకాలు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో అతను పారిస్ ఒలింపిక్స్కు దూరమయ్యాడు. మళ్లీ కెరీర్లో పాత ఫామ్ను అందుకుంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ కష్టకాలం నుంచి కోలుకుని, మళ్లీ ట్రాక్పైకి వచ్చి ఈ స్థాయిలో రాణించడం అతని పట్టుదలకు నిదర్శనం. కామన్వెల్త్ అథ్లెటిక్స్ విభాగంలో సురేష్ బాబు (1978 బ్రాంజ్), అంజు బాబీ జార్జ్ (2002 బ్రాంజ్), ఎం ప్రజూషా (2010 సిల్వర్) తర్వాత పతకం సాధించిన అతికొద్ది మంది భారతీయుల్లో శ్రీశంకర్ ఒకడు.
పోటీలో శ్రీశంకర్ తన రెండో ప్రయత్నంలో 8.09 మీటర్లు దూకి మొదట అగ్రస్థానంలో నిలిచాడు. కానీ జమైకాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ తజే గేల్ 8.15 మీటర్లు దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, స్థానిక ప్లేయర్ స్టీఫెన్ మెకెంజీ 8.08 మీటర్లతో కాంస్య పతకం సాధించాడు. తన ప్రదర్శనపై శ్రీశంకర్ స్పందిస్తూ.. "భారత్కు మళ్లీ ప్రాతినిధ్యం వహించి పతకం గెలవడం చాలా సంతోషంగా ఉంది. కానీ బర్మింగ్హామ్ సిల్వర్ను ఇక్కడ గోల్డ్గా మార్చాలని అనుకున్నాను, కాబట్టి పూర్తి సంతృప్తిగా లేదు. రాబోయే ఆసియా గేమ్స్ ముందు ఈ పతకం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది" అని తెలిపాడు.
ఈ పోటీలలో మరో భారతీయ అథ్లెట్ లోకేష్ సత్యనాథన్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తన తొలి ప్రయత్నంలోనే 7.97 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 8.38 మీటర్ల అత్యుత్తమ రికార్డు నెలకొల్పిన శ్రీశంకర్, రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింత మెరుగుపరుచుకుని భారత్కు మరిన్ని గోల్డ్ మెడల్స్ అందిస్తానని నమ్మకం వ్యక్తం చేశాడు.




