PSL Ball-Tampering: పీఎస్ఎల్‌లో బాల్ టాంపరింగ్ వివాదం.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కలిసి!

PSL Ball-Tampering: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మరో వివాదం చెలరేగింది. లాహోర్ ఖలందర్స్ జట్టు ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

Rishvik
Updated on: 30 March 2026 7:58 PM IST
PSL Ball-Tampering
X

PSL Ball-Tampering: పీఎస్ఎల్‌లో బాల్ టాంపరింగ్ వివాదం.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కలిసి!

PSL Ball-Tampering: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మరో వివాదం చెలరేగింది. లాహోర్ ఖలందర్స్ జట్టు ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఫకర్ జమాన్‌పై ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అతడు ఖండించాడు. మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో తాను తప్పు చేయలేదని తెలిపాడు. మరో 48 గంటల్లో మళ్లీ విచారణ జరగనుండగా.. ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడించనున్నారు.

బాల్ టాంపరింగ్ వివాదం లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో చోటుచేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో కరాచీ 19 ఓవర్లలో 5 వికెట్లకు 115పరుగులు చేసింది. విజయానికి కరాచీ జట్టుకు చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం అయ్యాయి. ఫైనల్‌ ఓవర్‌ వేసేందుకు లాహోర్ పేసర్ హారిస్ రవూఫ్‌ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కెప్టెన్ షహీన్‌ ఆఫ్రిది, ఫఖర్ జమాన్, రౌఫ్ కలిసి చర్చిస్తూ.. బాల్‌ను పలు మార్లు చేతుల్లోకి తీసుకున్నారు. ఫకర్ బంతిని టాంపరింగ్‌ చేసినట్లు ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు.

అంపైర్ ఫైసల్ అఫ్రిది బాల్‌ను పరిశీలించి.. మరో అంపైర్ షర్ఫుద్దౌలాతో చర్చించారు. అనంతరం బాల్‌ను ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు భావించి.. కరాచీ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు విధించారు. అలాగే బాల్‌ను కూడా మార్చారు. దీంతో కరాచీకి చివరి ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. మొదటి బంతికే ఖుష్దిల్ ఔటయ్యాడు. ఆ తర్వాత బంతిని రవూఫ్‌ వైడ్‌గా విసరగా.. రెండో బంతికి అబ్బాస్ అఫ్రిది ఫోర్ బాదాడు. మూడో బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయం అందించాడు. దాంతో కరాచీ కింగ్స్ 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ ఘటన తర్వాత అంపైరింగ్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీడియో ఫుటేజ్, మ్యాచ్ రిపోర్ట్ ఆధారంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తుది నిర్ణయం తీసుకోనుంది. గతంలో బాల్ టాంపరింగ్ వివాదంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై నిషేధం పడిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాంటి కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి పీసీబీ ఎలాంటి తీర్పు ఇస్తుందో చుడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story