IPL: ఓడిపోయినా చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ.. చెన్నై రికార్డు బద్దలు

IPL: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి అభిమానులకు హై వోల్టేజ్ మ్యాచ్‌ను అందించింది.

Mokshith
Published on: 8 May 2026 12:07 PM IST
IPL
X

 IPL

IPL: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి అభిమానులకు హై వోల్టేజ్ మ్యాచ్‌ను అందించింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై మ్యాచ్‌లో ఓడిపోయినా.. ఒక భారీ రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) పేరున్న పెద్ద రికార్డును అధిగమించింది.

వర్షం ప్రభావంతో మారిన మ్యాచ్ పరిస్థితులు

గురువారం లక్నోలోని ఇకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ వర్షం ప్ర‌భావం చూపింది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో 209 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం ఆర్‌సీబీకి 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే బెంగళూరు జట్టు చివరికి 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీ

లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అతడు మొత్తం 111 పరుగులు చేసి ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో భారీ షాట్లు ప్రేక్షకులను అలరించాయి. మార్ష్ దూకుడుతో లక్నో భారీ స్కోరు సాధించగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లు అతడిని నియంత్రించడంలో విఫలమయ్యారు.

ఆర్‌సీబీ ఆరంభంలోనే భారీ షాక్

213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో జేకబ్ బెథెల్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్ కలిసి అద్భుత భాగస్వామ్యం నిర్మించారు. ఇద్దరూ కలిసి 95 పరుగులు జోడించి జట్టును తిరిగి పోటీలోకి తీసుకువచ్చారు. పడిక్కల్ 25 బంతుల్లో 34 పరుగులు చేయగా, పాటీదార్ 31 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి.

టిమ్ డేవిడ్ పోరాటం వృథా

మధ్యలో జితేశ్ శర్మ త్వరగా అవుట్ కావడంతో ఆర్‌సీబీపై ఒత్తిడి పెరిగింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన టిమ్ డేవిడ్ వేగంగా ఆడుతూ మ్యాచ్‌ను మళ్లీ ఆసక్తికరంగా మార్చాడు. అతడు కేవలం 17 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. క్రునాల్ పాండ్యా 28 పరుగులు, రోమారియో షెఫర్డ్ 23 పరుగులతో సహకరించారు. చివరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. కానీ లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులే ఇచ్చాడు. దీంతో లక్నో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు బద్దలు

ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా ఆర్‌సీబీ ఒక చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200కు పైగా స్కోరు చేసిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. ఇప్పటివరకు బెంగళూరు జట్టు 40 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. సీఎస్‌కే 39 సార్లు 200కు పైగా స్కోరు చేసింది. ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ 38 సార్లతో మూడో స్థానంలో ఉంది. ఓటమి వచ్చినా ఆర్‌సీబీ ఈ అరుదైన రికార్డుతో అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story