Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మైంట్పై క్లారిటీ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన
Rohit Sharma: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, క్రీడా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మైంట్పై క్లారిటీ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన
Rohit Sharma: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, క్రీడా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరగనున్న మూడో వన్డే తర్వాత ఆయన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతారనే వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
రోహిత్ రిటైర్మెంట్పై బీసీసీఐ అధికారిక స్పందన
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, రోహిత్ శర్మ భవిష్యత్తుపై మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా ఊహాగానాలేనని పేర్కొన్నారు. లార్డ్స్లో జరిగే మూడో వన్డే ఆయన కెరీర్లో చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశారు. జట్టు యాజమాన్యం లేదా బీసీసీఐ ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రోహిత్ ఇంకా భారత జట్టు ప్రణాళికల్లో కీలక ఆటగాడేనని, రాబోయే సిరీస్ల్లో కూడా అతను అందుబాటులో ఉంటాడని వెల్లడించారు. అభిమానులు సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని కూడా సూచించారు.
రిటైర్మెంట్ వార్తలకు కారణమేంటి?
ఇటీవల రోహిత్ శర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే చర్చలు ఎక్కువ కావడంతో ఆయన రిటైర్మెంట్పై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ భవిష్యత్తు జట్టును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతారనే కథనాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి.
రోహిత్ లక్ష్యం ఇంకా ప్రపంచకప్నే
టీ20, టెస్టు క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు చెప్పిన రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తిగా వన్డే ఫార్మాట్పైనే దృష్టి పెట్టారు. 2027 వన్డే ప్రపంచకప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి మరోసారి ప్రపంచకప్ను గెలవాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్గా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించిన రోహిత్, వన్డే ప్రపంచకప్ను కూడా ఆటగాడిగా గెలవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం రిటైర్మెంట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సెలక్టర్లకు బీసీసీఐ కీలక సూచనలు
రోహిత్ శర్మ భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం బయటకు రావడం పట్ల బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించని విషయాలపై మీడియాతో మాట్లాడవద్దని సెలక్టర్లకు సూచించినట్లు తెలుస్తోంది. జట్టుకు సంబంధించిన నిర్ణయాలు, ఆటగాళ్ల భవిష్యత్తుపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని బోర్డు పరోక్షంగా స్పష్టం చేసింది. దీంతో లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ రిటైర్మెంట్పై జరుగుతున్న ప్రచారానికి బీసీసీఐ తాజా ప్రకటనతో తెరపడినట్లైంది.




