Rohit-Kohli Record: చరిత్ర సృష్టించిన రోహిత్, కోహ్లీ.. జంటగా నాలుగొందలు.. క్రికెట్ చరిత్రలో మొదటిసారి!

Rohit-Kohli Record: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని తమ ఖాతాలో వేసుకున్నారు. 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిసి ఆడిన తొలి భారత జోడీగా రో-కో చరిత్ర సృష్టించారు.

Rishvik
Published on: 19 July 2026 6:37 PM IST
Rohit-Kohli Record
X

Rohit-Kohli Record: చరిత్ర సృష్టించిన రోహిత్, కోహ్లీ.. జంటగా నాలుగొందలు.. క్రికెట్ చరిత్రలో మొదటిసారి!

Rohit-Kohli Record: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని తమ ఖాతాలో వేసుకున్నారు. 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిసి ఆడిన తొలి భారత జోడీగా రో-కో చరిత్ర సృష్టించారు. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో బరిలోకి దిగడంతో ఈ రికార్డు వారి ఖాతాలో చేరింది. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ ఘనతను అందుకోలేదు. దీంతో రోహిత్-విరాట్ జోడీ ప్రత్యేకంగా నిలిచింది.

టీమిండియా విజయాల్లో ఎన్నో చిరస్మరణీయ భాగస్వామ్యాలు నెలకొల్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గత దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలిసి ఆడుతూ ఎన్నో చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు.. ఇప్పుడు వన్డేల్లో మాత్రమే భారత జట్టుకు సేవలందిస్తున్నారు. అలాంటి సమయంలో లార్డ్స్ వేదికగా 400 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోవడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో 400 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిసి ఆడిన ఆరో జోడీగా కూడా రోహిత్-విరాట్ నిలిచారు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర-మహేల జయవర్ధనే ఉన్నారు. ఈ ఇద్దరు 550 మ్యాచ్‌లు కలిసి ఆడారు. ఆ తర్వాత మహేల జయవర్ధనే-తిలకరత్నే దిల్షాన్ (426), సంగక్కర-దిల్షాన్ (418), సనత్ జయసూర్య-ముత్తయ్య మురళీధరన్ (408), జాక్ కల్లిస్-మార్క్ బౌచర్ (407) ఉన్నారు. ఇప్పుడు 400 మ్యాచ్‌లతో రోహిత్-కోహ్లీ ఈ ఎలైట్ జాబితాలో చోటు సంపాదించారు.

భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన జోడీగా ఇదివరకు సచిన్ టెండూల్కర్-రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు 391 అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిసి ఆడారు. ఆ రికార్డును రోహిత్-కోహ్లీ ఇప్పటికే అధిగమించి.. నాలుగొందలు కొట్టారు. వ్యక్తిగతంగా అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 562 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా.. మహేంద్ర సింగ్ ధోనీ 535 మ్యాచ్‌లతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 514 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

ఇప్పటివరకు 562 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 28,285 రన్స్ బాదాడు. రన్ మెషీన్ 85 శతకాలు బాధగా.. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాటౌట్. కింగ్ 123 టెస్టులు, 313 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. రోహిత్ మూడు ఫార్మాట్లలో కలిపి 514 మ్యాచ్‌లు ఆడాడు. 50 శతకాలు, 112 హాఫ్ సెంచరీల సాయంతో 20,289 పరుగులు సాధించాడు. రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264. 67 టెస్టులు, 287 వన్డేలు, 159 టీ20లు ఆడాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story