మరోసారి సింగిల్ డిజిట్ కే.. వైభవ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నలిచ్చిన సంజూ
Sanju Samson: ఐర్లాండ్ సిరీస్లో వరుసగా 5, 0 పరుగులతో విఫలమైన ఓపెనర్ సంజూ సామ్సన్, ఈ మ్యాచ్లోనైనా ఫామ్లోకి వస్తాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.
మరోసారి సింగిల్ డిజిట్ కే.. వైభవ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నలిచ్చిన సంజూ
Sanju Samson: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక మొదటి టీ20 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. భారత జట్టు బ్యాటింగ్ తర్వాత భారీ వర్షంతో రిజల్ట్ రాకుండానే మ్యాచ్ ముగిసింది. అయితే లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ ఓపెనర్ సంజూ సామ్సన్, మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ నమ్మశక్యం కాని క్యాచ్తో సామ్సన్ను అవుట్ చేయడంతో, అతను మైదానంలోనే తలదించుకుని తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు.
పవర్ ప్లేలోనే చేతులెత్తేసిన సంజూ సామ్సన్..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయం కాసేపటికే బెడిసికొట్టింది. ఐర్లాండ్ సిరీస్లో వరుసగా 5, 0 పరుగులతో విఫలమైన ఓపెనర్ సంజూ సామ్సన్, ఈ మ్యాచ్లోనైనా ఫామ్లోకి వస్తాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. పవర్ ప్లే రెండో ఓవర్లోనే ఇంగ్లండ్ బౌలర్ సాకిబ్ మహమూద్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని భారీ షాట్ ఆడేందుకు సామ్సన్ ప్రయత్నించాడు.
బ్యాట్కు బంతి బాగానే తగిలినప్పటికీ, అది గ్రౌండ్కు దూరంగా గాల్లోకి లేచింది. అక్కడే బ్యాక్వర్డ్ పాయింట్లో సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్ స్టార్ ఫీల్డర్ టామ్ బాంటన్ అద్భుతమైన డైవ్తో ఆ క్యాచ్ను అందుకోవడంతో సామ్సన్ ఇన్నింగ్స్ కేవలం ఒక పరుగుకే ముగిసింది. 7 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేసిన సంజూ, తలదించుకుంటూ మైదానాన్ని వీడటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో అభిమానుల తీవ్ర ఆగ్రహం..
వరుసగా మూడు అంతర్జాతీయ మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో, సంజూ సామ్సన్పై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ వేదికలపై అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, గత టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్న సామ్సన్కు యాజమాన్యం వరుస అవకాశాలు ఇస్తున్నప్పటికీ, అతను వాటిని జారవిడుచుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువ ఆటగాడు వైభవ్ను బెంచ్కే పరిమితం చేసి, ఇలాంటి ప్రదర్శనలు చేయడం సరికాదని నెటిజన్లు బోర్డును ప్రశ్నిస్తున్నారు.
ఇషాన్ కిషన్ రన్ అవుట్..
సంజూ సామ్సన్ అవుట్ అయిన విచారంలో ఉన్న భారత్కు అదే ఓవర్లో మరో ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రన్ అవుట్ అయ్యాడు. బంతిని మిడ్-ఆన్ వైపు నెట్టి సింగిల్ కోసం ఇషాన్ కిషన్ వేగంగా పరుగెత్తాడు. అయితే నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ రన్ తీసేందుకు నిరాకరించాడు. అప్పటికే సగం పిచ్ దాటేసిన కిషన్, వెనక్కి తిరిగేలోపే ఇంగ్లండ్ ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. ఇషాన్ కిషన్ డైవ్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. కేవలం రెండు బంతులు ఆడిన కిషన్ డకౌట్గా వెనుదిరగడంతో, భారత జట్టు కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్రమైన ఒత్తిడిలో పడింది. అనంతరం అభిషేక్, శ్రేయాస్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నార. దీంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ పర్యటనలో మొదటి మ్యాచ్లోనే టీమిండియా అగ్రశ్రేణి బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సంజూ సామ్సన్ వరుస వైఫల్యాలు అతని అంతర్జాతీయ కెరీర్కు పరీక్షగా మారాయి. పవర్ప్లేలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే, రాబోయే రోజుల్లో యువ ఆటగాళ్లకు స్థానం కల్పించడం జట్టు యాజమాన్యానికి తప్పనిసరి కానుంది. భారత మిడిలార్డర్ బ్యాటర్లు ఈ ఒత్తిడిని అధిగమించి జట్టును ఎంతవరకు ఆదుకుంటారో చూడాలి.




