Shreyas Iyer: ఒక్క విజయం లేకున్నా శ్రేయస్ అయ్యర్ నయా చరిత్ర.. ధోనీ, కోహ్లీ రికార్డులు బద్దలు!

India captain Shreyas Iyer created history by winning his eighth consecutive T20I toss. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

Rishvik
Published on: 23 July 2026 7:27 PM IST
Shreyas Iyer
X

Shreyas Iyer: ఒక్క విజయం లేకున్నా శ్రేయస్ అయ్యర్ నయా చరిత్ర.. ధోనీ, కోహ్లీ రికార్డులు బద్దలు!

Shreyas Iyer: భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో వరుస మ్యాచ్‌ల్లో అత్యధికసార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. జింబాబ్వేతో గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలవడంతో శ్రేయస్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. టీ20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తన తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా టాస్ గెలిచిన తొలి సారథిగా కూడా శ్రేయస్ మరో రికార్డు అందుకున్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ ఒక్క విజయం అందుకోలేదు. కానీ వరుస మ్యాచ్‌ల్లో టాస్ మాత్రం గెలుస్తున్నాడు.

టీ20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ కెప్టెన్ కూడా తన తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా టాస్ గెలవలేదు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో కూడా కెప్టెన్‌గా తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా టాస్ గెలిచిన రెండో కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతకుముందు ఈ ఘనతను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాలీ హామండ్ మాత్రమే సాధించాడు. భారత టీ20 కెప్టెన్లలో వరుసగా అత్యధిక టాస్ విజయాలు సాధించిన జాబితాలో కూడా శ్రేయస్ అగ్రస్థానానికి చేరాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ వరుసగా ఏడు టాస్‌లు గెలవగా.. విరాట్ కోహ్లీ వరుసగా ఆరు టాస్‌లు గెలిచాడు. ఇప్పుడు శ్రేయస్ వరుసగా ఎనిమిది టాస్‌లు గెలిచి వారిద్దరినీ వెనక్కి నెట్టాడు.

మరోవైపు పూర్తి సభ్యత్వ దేశాల కెప్టెన్లలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ (10) అగ్ర స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (9) మాత్రమే శ్రేయస్ అయ్యర్ కంటే ఎక్కువ వరుస టాస్ విజయాలు సాధించాడు. దీంతో ఈ జాబితాలో శ్రేయస్ (8) మూడో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే గడ్డపై భారత్ మరో ప్రత్యేక రికార్డును కూడా నమోదు చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విదేశీ గడ్డపై అత్యధిక మంది ఆటగాళ్లకు అరంగేట్రం అవకాశం ఇచ్చిన దేశంగా జింబాబ్వే నిలిచింది. ఇప్పటివరకు 31 మంది భారత ఆటగాళ్లు జింబాబ్వేలోనే తమ టీ20 అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో యువ పేసర్ అశోక్ శర్మ కూడా టీమిండియా తరఫున తొలి టీ20 ఆడుతూ ఈ జాబితాలో చేరాడు.

భారత కెప్టెన్లుగా టీ20ల్లో వరుసగా అత్యధిక టాస్ విజయాలు:

శ్రేయస్ అయ్యర్ – 8 (2026)*

ఎంఎస్ ధోనీ – 7 (2010-12)

విరాట్ కోహ్లీ – 6 (2019)

ఎంఎస్ ధోనీ – 5 (2007)

రోహిత్ శర్మ – 5 (2020-22)

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story