Shubman Gill : అహ్మదాబాద్లో గిల్ తుఫాన్.. ఒకే ఇన్నింగ్స్తో 4 రికార్డులు బ్రేక్
Shubman Gill : ఐపీఎల్ 2026 లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చెన్నైపై చెలరేగి ఆడాడు. ఒకే ఇన్నింగ్స్తో 600 పరుగుల మార్కును దాటి 4 పెద్ద రికార్డులను బద్దలు కొట్టాడు.
Shubman Gill
Shubman Gill : ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్ ఊహించని రేంజ్లో గర్జిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన కీలక పోరులో గిల్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఈ ఇన్నింగ్స్ ద్వారా క్రికెట్ ప్రపంచంలో పలు భారీ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రతి బౌలర్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అతను ఆడిన క్లాస్ ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఒకే సీజన్లో 600 పరుగులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 600 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాటర్గా శుభ్మన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అతని తలపై ఆరెంజ్ క్యాప్ వచ్చి చేరింది. ఈ సీజన్లో గిల్కు ఇది ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకు లక్నో, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్పై గిల్ హాఫ్ సెంచరీ ప్లస్ స్కోర్లతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం లీగ్లో అత్యధిక పరుగుల వేటలో అందరికంటే ముందు వరుసలో దూసుకుపోతున్నాడు.
వార్నర్, గేల్ రికార్డుల సమం..
ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో 600 కంటే ఎక్కువ పరుగులు చేయడం గిల్కు ఇది మూడోసారి. ఈ ఘనతతో అతను క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. గతంలో ఐపీఎల్ 2023 సీజన్లో గిల్ ఏకంగా 890 పరుగులు భారీ స్కోర్ చేయగా, ఐపీఎల్ 2025 లో 650 పరుగులు సాధించాడు. ఇప్పుడు 2026 సీజన్లోనూ మళ్లీ 600 పరుగుల మార్క్ను దాటేశాడు. ఐపీఎల్లో మూడు కంటే ఎక్కువ సార్లు 600 ప్లస్ రన్స్ చేసిన రికార్డ్ కేవలం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పేరిట మాత్రమే ఉంది. ఇప్పుడు గిల్ కూడా వారి క్లబ్లోకి చేరిపోయాడు.
టీ20 క్రికెట్లో 6000 పరుగుల మైలురాయి పూర్తి
చెన్నైపై ఆడిన 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ద్వారా గిల్ టీ20 క్రికెట్లో ఒక అరుదైన మైలురాయిని దాటాడు. ఓవరాల్ టీ20 కెరీర్లో అతను 6000 పరుగుల మార్కును విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. కేవలం 185 ఇన్నింగ్స్ల్లోనే గిల్ ఈ ఘనత సాధించడం విశేషం. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 184 ఇన్నింగ్స్ల్లో, కేఎల్ రాహుల్ అత్యంత వేగంగా 166 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అందుకోగా.. ఇప్పుడు వారి తర్వాత స్థానంలో గిల్ నిలిచాడు.
ఏబీ డివిలియర్స్, కోహ్లీ రికార్డు కూడా గాల్లోకి
ఈ మ్యాచ్లో కేవలం వ్యక్తిగత రికార్డులే కాకుండా.. సాయి సుదర్శన్తో కలిసి ఓపెనింగ్లో గిల్ మరో సంచలనం సృష్టించాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు ఐపీఎల్లో 10వ సారి వంద పరుగుల భాగస్వామ్యాన్ని (సెంచరీ పార్ట్నర్షిప్) నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన విరాట్ కోహ్లీ - ఏబీ డివిలియర్స్ రికార్డును వీరు సమం చేశారు. అయితే డివిలియర్స్-కోహ్లీ జోడీ కంటే చాలా తక్కువ ఇన్నింగ్స్ల్లోనే గిల్-సుదర్శన్ ఈ ఘనత సాధించి నయా చరిత్ర సృష్టించారు.




