టీమిండియా అరంగేట్రానికి ముందే వైభవ్ సూర్యవంశీపై నిషేధం.. ఆ గొడవపై ఐసీసీ సీరియస్?

Vaibhav Sooryavanshi: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది.

Venkat
Published on: 16 Jun 2026 10:29 AM IST
Vaibhav Sooryavanshi
X

టీమిండియా అరంగేట్రానికి ముందే వైభవ్ సూర్యవంశీపై నిషేధం.. ఆ గొడవపై ఐసీసీ సీరియస్?

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి, సిక్సర్ల రికార్డులను బద్దలు కొట్టిన 15 ఏళ్ల 'వండర్ కిడ్' వైభవ్ సూర్యవంశీ మైదానంలో సహనం కోల్పోయాడు. శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఓటమి అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో భౌతిక ఘర్షణకు దిగడం, నెట్టింట ఈ వీడియో వైరల్ కావడంతో ఈ యువ ఆటగాడిపై ఐసీసీ నిషేధం విధిస్తుందా అనే ఆందోళన అభిమానుల్లో మొదలైంది.

దంబుల్లాలో హై డ్రామా.. సూపర్ ఓవర్ ఓటమి తర్వాత ఏం జరిగింది?

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. మొదట ఇరు జట్లు పరుగులు సమానంగా చేయడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత తీవ్రమైన వెలుతురు లేమి ఉన్నప్పటికీ, అంపైర్లతో వాదించి మరీ భారత కెప్టెన్ తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీలు సూపర్ ఓవర్‌కు మొగ్గు చూపారు.

అయితే, ఈ సూపర్ ఓవర్‌లో టీమిండియా ఓడిపోయింది. శ్రీలంక బౌలర్ కుగదాస్ మథులాన్ వేసిన ఆఖరి బంతికి 8 పరుగులు కావాల్సి ఉండగా, వైభవ్ కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో లంక ఆటగాళ్లు మైదానంలో విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక ఆటగాళ్లు వైభవ్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో, తీవ్ర నిరాశలో ఉన్న ఈ 15 ఏళ్ల యువ ఓపెనర్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానాన్ని వీడి వెళ్తూ మళ్లీ వెనక్కి వచ్చి లంక ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఒక లంక ఆటగాడిని చేతులతో నెట్టేయడం తీవ్ర కలకలం రేపింది. తోటి ఆటగాడు సూర్యాంశ్ శెడ్గే, లంక సీనియర్ నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకుని వైభవ్‌ను పక్కకు లాక్కెళ్లాల్సి వచ్చింది.

వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ నిషేధం విధిస్తుందా?

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్, త్వరలోనే జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత సీనియర్ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ తరుణంలో ఈ ఘర్షణ కారణంగా అతని అంతర్జాతీయ అరంగేట్రంపై నిషేధం పడుతుందా అన్న చర్చ నడుస్తోంది.

క్రికెట్ నిబంధనల ప్రకారం, ఈ మ్యాచ్ అంతర్జాతీయ ఐసీసీ మ్యాచ్ కాదు. ఇది రెండు దేశాల 'ఎ' జట్ల మధ్య జరిగిన సిరీస్ కాబట్టి, వైభవ్ ప్రవర్తనపై నేరుగా ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఐర్లాండ్ పర్యటనకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు.

అయినప్పటికీ, మ్యాచ్ రెఫరీ నివేదిక ఆధారంగా ఈ యువ ఆటగాడికి భారీ జరిమానా పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా వైభవ్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి హెచ్చరించే అవకాశాలు ఉన్నాయి.

వరుస వైఫల్యాలు.. పెరిగిన ఒత్తిడి..!

గత ఏడాది అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లతో గొడవపడి వార్తల్లో నిలిచిన వైభవ్‌కు, కోపమే పెద్ద బలహీనతగా మారుతోంది. ఈ టోర్నీలో అతని బ్యాటింగ్ కూడా అంతగా కలిసిరావడం లేదు. వరుసగా 14, 44, 21 పరుగులతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి విఫలం కావడం, దానికి తోడు సూపర్ ఓవర్‌లో జట్టును గెలిపించలేకపోయాననే ఒత్తిడి వల్లే అతను మైదానంలో అంతలా అసహనానికి గురైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఓటమితో భారత్ 'ఎ' జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. జూన్ 17న ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్టుతో జరగబోయే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది.

సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ అతి చిన్న వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభావంతుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న తరుణంలో ఆటతో పాటు మానసిక నియంత్రణ, మైదానంలో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని ఈ యువ సంచలనం గ్రహించాల్సి ఉంది. అప్పుడే సుదీర్ఘ కాలం పాటు టీమిండియాకు స్టార్ ఆటగాడిగా సేవలు అందించగలడు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story