Virat Kohli: ట్రావిస్ హెడ్‌తో కోహ్లీ వాగ్వాదం..షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన రన్ మెషిన్..!

Virat Kohli: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Naresh.k
Published on: 23 May 2026 8:15 AM IST
Virat Kohli
X

Virat Kohli: ట్రావిస్ హెడ్‌తో కోహ్లీ వాగ్వాదం..షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన రన్ మెషిన్..!

Travis Head: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు మ్యాచ్ ఊహించని వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన పోరులో పరుగులు, రికార్డుల కంటే.. విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదమే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్‌కు కరచాలనం చేయడానికి కోహ్లీ నిరాకరించడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

మైదానంలో ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఛేదిస్తున్న సమయంలో ఈ హై-వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ట్రావిస్ హెడ్‌తో ఏదో విషయంలో మాటల యుద్ధం నడిచింది. కోహ్లీ తీవ్రమైన ఆగ్రహంతో హెడ్‌ను మందలిస్తున్నట్లు కనిపించగా.. హెడ్ మాత్రం కేవలం ఒక చిన్న చిరునవ్వుతో దాన్ని లైట్ తీసుకున్నాడు. ఈ వివాదం ఎలా మొదలైందో స్పష్టంగా తెలియనప్పటికీ, మైదానంలో ఇరు జట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కోహ్లీ 11 బంతుల్లో 15 పరుగులు చేసి అవుటయ్యాడు.

షేక్‌హ్యాండ్ వివాదం

మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ సాంప్రదాయం ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు వరుసగా నిలబడి పరస్పరం కరచాలనం చేసుకునే సమయం వచ్చింది. ఆ సమయంలో ట్రావిస్ హెడ్ ఎంతో స్పోర్టివ్‌గా విరాట్ కోహ్లీకి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు. కోహ్లీ మాత్రం హెడ్‌ను పూర్తిగా విస్మరించాడు. అతడి వైపు చూడకుండా, చేయి కలపకుండా నేరుగా ముందుకు సాగిపోయాడు. హెడ్‌కు ముందున్న ఆటగాడితో, అలాగే హెడ్ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌తో ఎంతో సాధారణంగా కరచాలనం చేసిన కోహ్లీ.. కేవలం హెడ్‌ను మాత్రమే కావాలని పక్కనబెట్టడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. కోహ్లీ తన పక్క నుంచి వెళ్తున్నప్పుడు హెడ్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 255 పరుగులు చేయగా.. ఆర్‌సీబీ 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story