VVS Laxman-BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

VVS Laxman is Team India Head Coach. టీమిండియా హెడ్ కోచ్‌గా హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Rishvik
Published on: 7 July 2026 7:19 PM IST
VVS
X

VVS Laxman-BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

VVS Laxman-BCCI: భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ దిగ్గజ బ్యాటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వే పర్యటనతో పాటు 2026 ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టుకు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వెస్టిండీస్ సిరీస్‌తో బిజీగా గంభీర్:

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఆ తర్వాత జులై 23 నుంచి 26 వరకు జింబాబ్వేలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పాల్గొంటుంది. మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇదే సమయంలో భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కూడా ఉండటంతో.. గౌతమ్ గంభీర్ సీనియర్ జట్టుతోనే కొనసాగనున్నారని తెలుస్తోంది. దీంతో జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడల బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోచ్‌లతో లక్ష్మణ్:

వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన సపోర్ట్ స్టాఫ్ కూడా భారత జట్టుతో కలిసి వెళ్లనున్నట్లు సమాచారం. మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్‌గా, మాజీ బ్యాటర్ హృషీకేశ్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదే కోచింగ్ బృందం ఆసియా క్రీడల్లో కూడా భారత జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

లక్ష్మణ్‌కు ఇదేం కొత్త కాదు:

సీనియర్ జట్టు మరో సిరీస్‌లో బిజీగా ఉన్న సమయంలో భారత యువ జట్టుకు కోచ్‌గా ఉండటం వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇదే మొదటిసారి కాదు. 2022లో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఆసియా కప్ సమయంలో తాత్కాలిక హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అనంతరం న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. 2023 ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టును స్వర్ణ పతక విజేతగా నిలిపిన ఘనత కూడా లక్ష్మణ్‌కే దక్కింది. ఈ అనుభవంతోనే మరోసారి ఆయనపై బీసీసీఐ విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది.

యువ జట్టుకు శ్రేయస్ సారథ్యం:

జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు కూడా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కలేదు. ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లను వికెట్‌కీపర్లుగా ఎంపిక చేశారు. అయితే సంజూ ఆసియా క్రీడల కోసం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు కొత్త కాంబినేషన్లను పరీక్షించే ప్రక్రియను కొనసాగిస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story