LSG vs KKR : కార్తీక్ త్యాగికి తప్పిన ముప్పు.. వరుసగా 2 నో బాల్స్ వేసినా బౌలింగ్ నుంచి ఎందుకు తొలగించలేదు?
LSG vs KKR : ఐపీఎల్ 2026లో కార్తీక్ త్యాగి వరుసగా రెండు నో బాల్స్ వేసినా బౌలింగ్ నుంచి ఎందుకు తప్పించలేదో తెలుసా? క్రికెట్ నిబంధనల వెనుక ఉన్న అసలు కారణం ఇదే.
Karthik Tyagi
LSG vs KKR : ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ ఊహించని మలుపులతో సాగింది. ముఖ్యంగా చివరి ఓవర్లో చోటుచేసుకున్న హైడ్రామా క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. కేకేఆర్ బౌలర్ కార్తీక్ త్యాగి వరుసగా రెండు బీమర్లు (ఫుల్ టాస్ బంతులు) వేసినప్పటికీ, అతడిని బౌలింగ్ నుంచి ఎందుకు తప్పించలేదనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నిబంధనల ప్రకారం అతడు బ్యాన్ కావాల్సి ఉన్నా, అంపైర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో చూద్దాం.
చివరి ఓవర్లో ఏం జరిగింది?
లక్నో విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు కావాలి. కార్తీక్ త్యాగి వేసిన రెండో బంతి నేరుగా బ్యాటర్ హిమ్మత్ సింగ్ ఛాతీ వైపు దూసుకొచ్చింది. అంపైర్ దానిని నో బాల్గా ప్రకటించారు. ఆ తర్వాత వేసిన ఫ్రీ-హిట్ బంతి కూడా నడుము కంటే ఎత్తులో రావడంతో మరోసారి అంపైర్ నో బాల్ ఇచ్చారు. సాధారణంగా ఒకే ఓవర్లో రెండుసార్లు నడుము కంటే ఎత్తులో ఫుల్ టాస్ బంతులు వేస్తే ఆ బౌలర్ను మ్యాచ్ నుంచి తప్పించాలనే నిబంధన ఉంది. కేకేఆర్ కెప్టెన్ రహానే, కోచ్ అభిషేక్ నాయర్ కూడా అదే అనుకుని స్పిన్నర్ అనుకూల్ రాయ్ను సిద్ధం చేశారు. కానీ అంపైర్లు మాత్రం త్యాగితోనే ఓవర్ వేయించారు.
అసలు నిబంధన ఏం చెబుతోంది?
క్రికెట్ నిబంధనల ప్రకారం (MCC Law 41.7), ఒక బౌలర్ వేసే ఫుల్ టాస్ బంతి బ్యాటర్కు హాని కలిగించేలా ఉంటేనే అంపైర్ హెచ్చరిక లేదా బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ కార్తీక్ త్యాగి వేసిన మొదటి నో బాల్ నేరుగా బ్యాటర్ వైపు వచ్చింది, కాబట్టి అది ప్రమాదకరమైనది. కానీ, రెండో నో బాల్ ఆఫ్ స్టంప్కు చాలా వెలుపలగా వెళ్ళింది. అది బ్యాటర్ శరీరానికి తగిలే అవకాశం లేదు కాబట్టి అంపైర్లు దానిని ప్రమాదకరం కాదు అని తేల్చారు. నిబంధనల ప్రకారం రెండు నో బాల్స్లో కనీసం ఒకటి ప్రమాదకరం కాకపోతే బౌలర్ను కొనసాగించవచ్చు. అందుకే త్యాగి బౌలింగ్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం రాలేదు.
మలుపు తిరిగిన మ్యాచ్
త్యాగికి లభించిన ఈ అవకాశం లక్నోకు శాపంగా మారింది. ఫ్రీ-హిట్లో హిమ్మత్ సింగ్ ఫోర్ కొట్టినప్పటికీ, తర్వాతి బంతికే అతడిని త్యాగి అవుట్ చేశాడు. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో మహమ్మద్ షమీ సిక్సర్ బాది మ్యాచ్ను టై చేశాడు. అయితే సూపర్ ఓవర్లో సునీల్ నరైన్ అద్భుత బౌలింగ్తో లక్నోను కేవలం 1 పరుగుకే కట్టడి చేశాడు. ఆ తర్వాత కేకేఆర్ ఒకే బంతికి ఫోర్ కొట్టి విజయం సాధించింది. త్యాగి వేసిన ఆ నో బాల్ డ్రామా మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయినా, నిబంధనలపై మాత్రం పెద్ద చర్చకు దారితీసింది.
గందరగోళంలో కేకేఆర్ మేనేజ్మెంట్
ఈ సంఘటన జరిగిన సమయంలో కేకేఆర్ డగౌట్లో గందరగోళం నెలకొంది. రూల్స్ ప్రకారం త్యాగి బౌలింగ్ చేయకూడదని భావించిన కోచ్ అభిషేక్ నాయర్ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. అనుకూల్ రాయ్ను బంతి వేయమని కోరినప్పటికీ, అంపైర్లు మాత్రం పాత రూల్స్ను కాకుండా బంతి దిశను పరిగణనలోకి తీసుకుని త్యాగికే మద్దతు పలికారు. ఈ క్లారిటీ లేకపోవడం వల్లే మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.




