Kotabommali: నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ!

Kotabommali: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు.. కొత్తమ్మతల్లి ఉత్సవాలపై సమీక్ష.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 20 Sept 2026 1:29 PM IST
Kotabommali
X

Kotabommali: నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ!

Kotabommali: శ్రీకాకుళం (కోటబొమ్మాళి), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రజల నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్థానిక నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం కొత్తమ్మతల్లి ఉత్సవాల నిర్వహణపై ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, గతంలో కంటే మరింత విస్తృతంగా, పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్‌ వెలుగులు, పార్కింగ్‌, రవాణా, వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవలు, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూ లైన్లు, వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.అదేవిధంగా భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు

వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు కొత్తమ్మతల్లి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూనే స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు.ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపాలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు యువతను ప్రోత్సహించే విధంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. పిల్లలు, యువత, మహిళలు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని కమిటీ సభ్యులకు తెలిపారు.

త్వరలో జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం

ఉత్సవాల నిర్వహణకు సంబంధించి త్వరలోనే జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాఖల వారీగా బాధ్యతలు అప్పగించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. భక్తుల రద్దీ, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్‌, రహదారులు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ తదితర అంశాలపై ముందస్తు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. కొత్తమ్మతల్లి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడంతో పాటు, ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.