Pathapatnam: పాతపట్నం చెక్పోస్ట్ను ఆకస్మికంగా పరిశీలించిన సీఐ వెంకటరావు
Pathapatnam: ఆంధ్ర, ఒడిశా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం చెక్పోస్ట్ వద్ద పోలీసులు నిఘాను తీవ్రం చేశారు.
Pathapatnam: పాతపట్నం చెక్పోస్ట్ను ఆకస్మికంగా పరిశీలించిన సీఐ వెంకటరావు
Pathapatnam: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు నిఘాను తీవ్రం చేశారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం పాతపట్నం అంతరాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం (చెక్ పోస్ట్) వద్ద పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిల్లి వెంకటరావు ఆకస్మికంగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. అక్కడ అందుబాటులో ఉన్న భద్రతా ఏర్పాట్లను, రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఐ కిల్లి వెంకటరావు మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం నుండి సరిహద్దుల గుండా ఆంధ్రప్రదేశ్లోకి ఎటువంటి అక్రమ రవాణా జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా గంజాయి, నాటుసారా, మద్యం వంటి నిషేధిత పదార్థాల సరఫరాపై నిరంతరం డేగకన్ను వేసి ఉంచాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని గట్టిగా ఆదేశించారు. సరిహద్దు దాటి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతించాలి.
అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను, వాహనాలను ప్రత్యేకంగా నిఘాలో ఉంచాలి. విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని సర్కిల్ ఇన్స్పెక్టర్ కిల్లి వెంకటరావు హెచ్చరించారు. రహదారి భద్రతపై కూడా సీఐ సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. సరిహద్దుల గుండా రాకపోకలు సాగించే ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయాల్లో రక్షణ చర్యల్లో భాగంగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై, నకిలీ నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలపై ఎటువంటి మొహమాటం లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరిహద్దుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమాలను అరికట్టే దిశగా మరిన్ని పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని సీఐ వెంకటరావు వెల్లడించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో సీఐ వెంట స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




