Srikakulam: శ్రీకాకుళం ఎరువుల పంపిణీలో అపైమ్స్ 2.0 విధానం

Srikakulam: ఖరీఫ్ ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం అపైమ్స్ 2.0 డిజిటల్ విధానం. శ్రీకాకుళం జిల్లాకు భారీగా యూరియా నిల్వలు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 17 July 2026 8:28 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళం ఎరువుల పంపిణీలో అపైమ్స్ 2.0 విధానం

శ్రీకాకుళం: కూట‌మి ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉండేందుకు, ఖ‌రీఫ్ లో ఎరువుల కొర‌త అన్న‌ది రాకుండా ఉండేందుకు డిజిట‌ల్ విధానాన్ని అందుకుని, బ్లాక్ మార్కెట్ల‌కు ఎరువులు త‌ర‌లి పోకుండా డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నేతృత్వంలో పార‌ద‌ర్శ‌క‌తే ప్రాధాన్య‌మ‌ని భావిస్తూ నిరంత‌రం సంబంధిత ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు,

గ‌తంలో మాదిరిగా కాకుండా ఎవ్వ‌రికీ ఏ ఇబ్బందీ లేకుండా Andhra Pradesh Agriculture Information Management System 2.0 (అపైమ్స్ 2.0) అనే డిజిట‌ల్ విధానాన్ని తీసుకుని వ‌చ్చి అర్హుల‌యిన ప్ర‌తి ఒక్క‌రికీ ఎరువులు పంపిణీ చేస్తున్నామ‌ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యంగా ప్ర‌స్తుత ఖ‌రీఫ్ కు శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి 37 వేల ట‌న్నుల‌కు పైగా (37,707) యూరియా అవ‌స‌రం కాగా సిద్ధంగా ఉన్నాయ‌ని, ఇప్ప‌టికే (20,966 ) యూరియా జిల్లాకు చేరుకుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

అర్హ‌త అనుస‌రించి పంపిణీ

రైతుల భూ వివరాలు, పంట రకం, సాగు విస్తీర్ణాన్ని అనుస‌రించి శాస్త్రీయ సిఫార‌సుల మేరకే ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ఎరువుల అర్హతను లెక్కించి పంపిణీ చేస్తున్నామ‌ని, ఒక‌వేళ ఎవ్వ‌రైనా ఆన్లైన్లో న‌మోదు కాక‌పోతే ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని భ‌రోసా ఇచ్చారు. ఆన్లైన్ లో న‌మోదు కాని వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి ఎరువులు అందించేలా ప్రభుత్వం తగిన సదుపాయం కల్పించిందన్నారు. వీరి వివ‌రాలు ప్ర‌త్యేకంగా నమోదు చేస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి అచ్చెన్న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ..వివ‌రాలివి.

నిరంతరం అధికారుల‌తో స‌మీక్ష‌లు

రాష్ట్రంలోని ప్రతి సాగుదారుడికీ సకాలంలో, పారదర్శకంగా ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. Andhra Pradesh Agriculture Information Management System 2.0 (అపైమ్స్ 2.0) నూతన డిజిటల్ విధానాన్ని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, ప్రైవేటు ఎరువుల డీలర్లతో అనుసంధానించామ‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత లేకుండా అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా నిల్వలు, విక్రయాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, దీనివల్ల బ్లాక్ మార్కెట్ నియంత్ర‌ణ‌కు, అక్రమ మళ్లింపులకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని మంత్రి భరోసా ఇచ్చారు.

బ్లాక్ మార్కెట్టుపై కొర‌డా..పార‌దర్శ‌క‌త‌కు ప్రాధాన్యం..

జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 37,707 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటికే 20,966 మెట్రిక్ టన్నులు చేరాయి. ఇప్పటివరకు 8,041 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేయగా, రైతు సేవా కేంద్రాల వద్ద మరో 5,105 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

386 రైతు సేవా కేంద్రాలు, 36 సహకార సంఘాలు, 7 డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా పంపిణీ కొనసాగుతోంది. త్వరలో మరో 12,925 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుండగా, మొత్తం అవసరాలను తీర్చేందుకు మిగిలిన 16,741 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కూడా దశలవారీగా అందుబాటులోకి రానుంది. జిల్లాకు ఇంకా రావలసిన మిగిలిన కోటాను కూడా త్వరితగతిన రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి విక్రయం ఆన్‌లైన్‌లో నమోదవుతుండటంతో ఎరువుల దుర్వినియోగానికి తావుండదని, అన్నదాతలంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు,

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story